ప్రధాని కల తుడిచిపెట్టుకుపోయింది: రాజపక్సకి చేదు
కొలంబో: శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సకి మళ్లీ భంగపాటు తప్పలేదు. పార్లమెంటు ఎన్నికలలో తుది ఫలితాల వెల్లడికి ముందే ఆయన తన ఓటమిని అంగీకరించాడు. ప్రధాని కావాలన్న తన కల తుడిచి పెట్టుకుపోయిందని రాజపక్స అన్నాడు.
ఓటమిని అంగీకరిస్తున్నట్లు చెప్పాడు. యూపీఎఫ్ఏ ఓడిపోవడం చాలా బాధాకరమని చెప్పాడు. ప్రజల తీర్పును గౌరవిస్తానని రాజపక్స చెప్పాడు. అధ్యక్ష పదవి పోతే పోయిందని, ప్రధానిగానైనా సేవలు అందించాలన్న తన కల చెదిరిపోయిందన్నాడు.
రాజపక్స నేతృత్వంలోని యునైటెడ్ పీపుల్స్ ఫ్రీడం అలయన్స్ పార్టీని, ప్రధాని రనిల్ విక్రమ సింఘే నేతృత్వంలోని యునైటెడ్ నేషనల్ పార్టీ ఓడించింది. ఓ యుద్ధంలో బాగా పోరాడి తాము ఓడిపోయామని రాజపక్స అన్నాడు.
మొత్తం 22 జిల్లాలు ఉండగా తాము 8 చోట్ల మాత్రమే విజయం సాధించామని చెప్పాడు. అధ్యక్ష పదవిని కోల్పోయిన ఏడు నెలల అనంతరం ఆయన ప్రధాని పీఠంపై కూర్చోవాలని చేసిన ఆలోచనలనూ ప్రజలు తిప్పికొట్టారు. శ్రీలంక చరిత్రలో అత్యంత ప్రశాంతంగా జరిగిన ఎన్నికలు ఇవేనని అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన వ్యాఖ్యానించారు.