అక్కడ ముస్లిం మహిళలు బహిరంగ ప్రదేశాల్లో తిరగలేని పరిస్థితి..ఎందుకో తెలుసా..?
శ్రీలంక: శ్రీలంకలో ఆత్మాహుతి దాడుల తర్వాత దేశభద్రతా చర్యల్లో భాగంగా బురఖాలు ధరించడంపై ఆదేశ ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. బురఖాలపై నిషేధం విధించడంతో అక్కడి ముస్లిం సామాజిక మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. తమ మతాచారంలో భాగంగా బురఖా ధరించే బయటకు రావాల్సి ఉన్నందున బహిరంగ ప్రదేశాల్లో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మహిళలు రాలేకపోతున్నారు. ఇంటికే పరిమితమవుతున్నారు.
బురఖాలపై నిషేధం విధించిన శ్రీలంక ప్రభుత్వం
శ్రీలంకలో ఈస్టర్ ఆదివారం రోజున జరిగిన వరుస ఆత్మాహుతి దాడుల్లో 250 మందికి పైగా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత భద్రతను కట్టుదిట్టం చేసే పనిలో భాగంగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది ఆ దేశ ప్రభుత్వం. బురఖాలు ధరించడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అక్కడి ముస్లిం సామాజిక మహిళలు బహిరంగ ప్రదేశాలకు వెళ్లాలంటే బురఖా తీసి వెళ్లలేని పరిస్థితి దాపురించింది. ఏప్రిల్ 29 నుంచి అమల్లోకి వచ్చిన నిషేధంతో ముస్లిం మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఇంటికే పరిమితం అవుతున్న ముస్లిం మహిళలు
కొలొంబోకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న వేలంపిటియా పట్టణంలో నివసించే 27 ఏళ్ల ఫర్జానా తన ఆవేదనను తెలిపింది. తాను ఖురాన్ బోధించే టీచరుగా పనిచేస్తున్నట్లు చెప్పిన ఫర్జానా ... ప్రతిరోజు బయటికి వెళ్లాల్సి ఉంటుందని వెల్లడించింది. తాను 11 ఏళ్ల వయసు నుంచే బురఖా ధరిస్తున్నట్లు చెప్పిన ఫర్జానా శ్రీలంక ప్రభుత్వం బురఖా ధరించడంపై నిషేధం విధించడంతో ఇంటికే పరిమితమైనట్లు తెలిపింది. అయితే ప్రస్తుతం స్కూళ్లకు సెలవులు కాబట్టి ఇంట్లో ఉంటున్నట్లు చెప్పిన ఫర్జానా... స్కూళ్లు తెరిచేనాటికి నిషేధం ఎత్తి వేయకపోతే తనకు చాలా కష్టం అవుతుందని చెప్పుకొచ్చింది. బురఖా ధరించడం ముఖ్యమా లేక ఉద్యోగం ముఖ్యమా అని అడిగితే తనకు మాత్రం బురఖా ధరించడమే ముఖ్యమని చెబుతోంది.
బురఖా ధరించకుంటే నగ్నంగా ఉంటాననే భావన కలుగుతుంది: జరీన్
ఇదిలా ఉంటే మరో యువతి జరీన్ రషీద్ తన ఆవేదనను మరోలా వివరించింది. బుర్ఖా ధరించడంపై నిషేధం ఎత్తివేసినప్పటికీ... భద్రతా పరమైన కారణాలతో కొన్ని చోట్ల తీసేయాల్సి ఉంటుందని చెప్పింది. అంతేకాదు బుర్ఖా ధరించి బయట తిరిగినా జాతివివక్షకు గురవుతామనే ఆందోళన వ్యక్తం చేసింది. బురఖా ధరిస్తే ఉగ్రవాదులుగా చూస్తారనే భయాన్ని వ్యక్తం చేసింది. అందుకే ఇంట్లోనే ఉండటం చాలా బెటర్ అని జరీన్ చెప్పుకొచ్చింది. 2016లో ఫ్రాన్స్లో దాడులు జరిగిన తర్వాత బుర్ఖాలు ధరించిన మహిళలను అక్కడి పోలీసులు తీసేయించారు. అంతేకాదు బీచ్లలో ముస్లిం మహిళలు ధరించే బురఖినీలను సైతం తీసేయించారు. తాను 14 ఏళ్ల సమయంలో బురఖా ధరించడం ప్రారంభించినట్లు చెప్పిన జరీన్... అప్పటి నుంచి భగవంతుడికి తాను చాలా దగ్గరైనట్లు చెప్పింది. ఆత్మీయంగా చాలా ఎదిగినట్లు వెల్లడించింది. తాను ఏ పని చేయాలన్నా చాలా ధైర్యంతో ముందడుగు వేసేదాన్నని జరీన్ చెబుతోంది. బురఖా తన ఒంటిపై లేకుంటే తాను నగ్నంగా ఉన్నానన్న భావన కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేసింది.
బురఖాలు ధరించడం ఇస్లాంలో తప్పని సరి కాదా..?
బురఖాలు ధరించడం ఇస్లాం మతంలో తప్పనిసరి కాదంటూ న్యాయవాది, సామాజిక కార్యకర్త మరియమ్ వదూద్ చెబుతున్నారు. ముందుగా దేశ భద్రత ముఖ్యమని ఆ తర్వాతే మతం ఇతరత్ర విషయాలు వస్తాయని చెప్పారు. ప్రతి ఒక్కరి హక్కులకు కొంత పరిమితి ఉండాలని మరొకరు భయభ్రాంతులకు గురయ్యేలా స్వతంత్రం ఉండకూడదనే అభిప్రాయాన్ని మరియమ్ వ్యక్త పరిచారు. బురఖాలు నికబ్లు ధరించడం వల్ల దేశంలో వేర్పాటు వాదం పెరిగిపోతుందని అది దేశ భద్రతకే ప్రమాదంగా పరిణమించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒకే ముస్లిం సామాజిక వర్గంలో విబేధాలు తలెత్తే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పారు. ఇక మరియమ్ వాదన ఇలా ఉంటే ఇంకొందరి వాదన ఇందుకు భిన్నంగా ఉంది. ముస్లిం మహిళలు ఇప్పటికే కొన్ని ఆంక్షలతో జీవిస్తున్నారని బురఖాలపై నిషేధం విధించి మరింతగా వారిని అణిచివేసే ప్రయత్నం చేయరాదని పేర్కొంటున్నారు. నిత్యం బురఖాలు ధరించే సంప్రదాయ కుటుంబాల నుంచి వచ్చే మహిళల పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.
బురఖాలు ధరించే వారంతా ఉగ్రవాదులు అన్న ఆలోచన నుంచి ప్రభుత్వం బయటకు రావాలని పలువురు చెబుతున్నారు. ఎవరో ఒకరు ఉగ్రదాడులకు పాల్పడితే మొత్తం ముస్లిం మహిళలను బాధ్యులుగా చేసి చూడటం చాలా అన్యాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.