శ్రీలంక పేలుళ్లు: మరో వికెట్ డౌన్! రాజీనామా చేసిన పోలీస్ బాస్: అక్రమ నివాసులపై ఉక్కుపాదం
కొలంబో: శ్రీలంకలో మరో వికెట్ పడింది. శ్రీలంక పోలీసు విభాగం అత్యున్నత అధికారి, ఇన్ స్పెక్టర్ జనరల్ పుజిత్ జయసుందర తన పదవికి రాజీనామా చేశారు. ఆత్మాహూతి దళాల పేలుళ్లకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఈస్టర్ సండే నాడు చర్చిలు, హోటళ్లపై ఉగ్రవాదుల ఆత్మాహూతి దాడులు చోటు చేసుకోవచ్చంటూ ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి పదిరోజుల ముందే సమాచారం అందినప్పటికీ..దాన్ని నిరోధించడంలో విఫలమయ్యారనే ఆరోపణలను జయసుందర ఎదుర్కొంటున్నారు.
జయసుందర రాజీనామా చేసిన విషయాన్ని శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ధృవీకరించారు. జయసుందర తన ఉద్యోగానికి రాజీనామా చేశారని వెల్లడించారు. త్వరలోనే కొత్త ఇన్ స్పెక్టర్ జనరల్ ను నియమిస్తానని అన్నారు. ఆత్మాహూతిదాడుల అనంతరం- ప్రభుత్వ విభాగంలోని అత్యున్నత స్థాయి అధికారి రాజీనామా చేయడం ఇది రెండోసారి. ఇదివరకు- శ్రీలంక రక్షణమంత్రిత్వ శాఖ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండో రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆదేశాల మేరకు హేమసిరి విధుల నుంచి తప్పుకొన్నారు.
అక్రమంగా నివసిస్తున్న వారిపై ఉక్కుపాదం
ఇదిలావుండగా.. రక్షణ మంత్రిత్వశాఖ కార్యకలాపాలను ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రోజువారీ సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నారు. దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపాలని రణిల్ ఆదేశించారు. ఈ విషయంలో ఆయన పోలీసులు, భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు చెబుతున్నారు. విసా గడువు ముగిసినప్పటికీ.. స్వదేశానికి వెళ్లకుండా, లంకలోనే తలదాచుకుంటున్న వారిని అన్వేషిస్తున్నారు పోలీసులు. పాస్ పోర్టు కాల పరిమితి ముగిసిన వారినీ అదుపులోకి తీసుకుంటున్నారు. ఆత్మాహూతి దాడులకు సహకరించి ఉంటారనే అనుమానంపై పోలీసులు ఇప్పటికే 140 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారి నుంచి మరింత కీలకమైన సమాచారాన్ని రాబట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రాజధాని కొలంబో సహా దేశంలో వివిధ ప్రాంతాల్లో మరిన్ని ఉగ్రవాదుల దాడులు చోటు చేసుకోవచ్చనే సమాచారం ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని, దేశ మారుమూల ప్రాంతాల్లో కూడా విస్తృత సోదాలు నిర్వహిస్తున్నట్లు రణిల్ విక్రమసింఘే తెలిపారు.