కరోనావైరస్: శ్రీలంకలో నమోదైన తొలి మరణం, పెరుగుతున్న పాజిటివ్ కేసులు
కొలంబో: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ బారిన పడి శ్రీలంక దేశంలో ఓ వ్యక్తి మరణించాడు. శ్రీలంకలో నమోదైన తొలి కరోనా మరణం ఇదే కావడం గమనార్హం. డయాబెటిస్ ఉన్న 65ఏళ్ల వ్యక్తికి కరోనా సోకడంతో అతడు మరణించినట్లు అక్కడి వైద్యులు తెలిపారు.
కొలొంబలోని ఇన్ఫెసియస్ డీసీజెస్ హాస్పిటల్(ఐడీహెచ్)లో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది హెల్త్ సర్వీసెస్ అనిల్ జైసింఘే వెల్లడించారు. ఆ రోగికి హైబీపీ ఉందని, షుగర్ వ్యాధికి కూడా ఉందని తెలిపారు.
కాగా, శనివారం వరకు శ్రీలంకలో 115 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతి చెందగా, తొమ్మిది మందికి కరోనా నయమైంది. మరో 199 మంది కరోనా లక్షణాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా కట్టడి కోసం శ్రీలంకలోనూ కర్ఫ్యూ విధించారు. విదేశాలకు చెందిన విమానాల రాకపోకలపై నిషేధం విధించారు. ఏప్రిల్ 7 వరకు ఈ నిషేధం కొనసాగనుంది.
కాగా, కరోనా వ్యాపిస్తున్న కారణంగా జైళ్లలోని 1,460 మంది ఖైదీలను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. నార్త్ సెంట్రల్ ప్రావిన్స్ లో కరోనావైరస్ భయాందోళనలతో ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ఖైదీలు మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే ఖైదీలను విడుదల చేశారు.
ఇక ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా మరణాల సంఖ్య భారీగానే పెరుగుతోంది. 31,737 మరణాలు సంభవించగా.. 6,77,683 మంది కరోనా బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 1,46,310 మంది కరోనావైరస్ బారినపడి కోలుకున్నారు. ఇక భారతదేశంలో ఇప్పటి వరకు సుమారు 980కిపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 27 మంది ప్రాణాలు కోల్పోయారు.