ఆత్మాహూతి దాడి టార్గెట్ లో భారత రాయబార కార్యాలయం: భద్రత కట్టుదిట్టం
కొలంబో: శ్రీలంక రాజధాని కొలంబోని భారత రాయబార కార్యాలయం సహా మొత్తం 11 చోట్ల ఆత్మాహూతి దళం దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్లు తేలడం.. దానికి అనుగుణంగా మొత్తం ఎనిమిది చోట్ల శక్తిమంతమైన బాంబు పేలుళ్లు చోటు చేసుకోవడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. కొలంబోలోని భారత రాయబార కార్యలయానికి కట్టుదిట్టమైన భద్రత కల్పించాయి. రెండంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశాయి. ప్రత్యేక భద్రతా బలగాలను మోహరింపజేశాయి.
శ్రీలంక నరమేథం! ఐసిస్ పనే! జిహాదీలుగా నిర్ధారణ
రెండంచెల భద్రత..
గుడ్ ఫ్రైడే లేదా ఈస్టర్ సండే వంటి ప్రత్యేక రోజుల్లో కనీసం 11 చోట్ల, పెద్ద సంఖ్యలో ప్రజలు గుమికూడి ఉండే ప్రాంతాలపై బాంబు దాడులు, ఆత్మాహూతి దాడులు చోటు చేసుకోవచ్చని విదేశీ ఇంటెలిజెన్స్ నుంచి శ్రీలంక పోలీసు అత్యున్నత అధికారులకు కీలక సమాచారం అందింది. ఈ 11 ప్రాంతాల్లో భారత రాయబార కార్యాలయం కూడా ఉన్నట్లు తేలింది. మొదట్లో ఈ సమాచారంపై పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు అక్కడి ప్రభుత్వం. తాజాగా ఈస్టర్ సండేను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహూతి దాడులు చోటు చేసుకోవడంతో ఉలిక్కిపడ్డారు అక్కడి భద్రతా బలగాలు. జాబితాలో ఉన్నట్టుగా అనుమానిస్తోన్న భారత రాయబార కార్యాలయానికి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రెండంచెల భద్రతను కల్పించారు.
నేషనల్ తౌహీత్ జమాత్ - ఎన్టీజే అనే సంస్థ ఈ ఆత్మాహూతి దాడులకు పాల్పడవచ్చని తమకు విశ్వసనీయ సమాచారం అందినట్లు పోలీస్ ఉన్నతాధికారి పుజుత్ జయసుందర వెల్లడించారు. తాజాగా ఆ దేశంలో నెలకొన్న పరిస్థితులను చూస్తోంటే.. ఇంటెలిజెన్స్ అధికారుల అంచనా గానీ, అనుమానాలు గానీ వాస్తవ రూపం దాల్చిందని అయినప్పటికీ.. వాటిని నిరోధరించడంలో అక్కడి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేకపోయిందనేది చర్చనీయాంశమౌతోంది.
నేషనల్ తౌహీత్ జమాత్ - ఎన్టీజే అనేది శ్రీలంకలో కొత్తగా పుట్టుకొచ్చిన సంస్థగా చెబుతున్నారు. మొదట్లో ఈ సంస్థకు చెందిన ప్రతినిధులే మారణకాండను సృష్టించి ఉండొచ్చంటూ అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనికి తోడు- పదిరోజుల కిందటే విదేశీ ఇంటెలిజెన్స్ వర్గాలు శ్రీలంక పోలీసులకు ఉప్పందించడంతో ఈ సంస్థ పేరు తాజాగా వెలుగులోకి వచ్చింది. గత ఏడాది శ్రీలంకలో పెద్ద ఎత్తున గౌతమ బుద్ధుడి విగ్రహాల విధ్వంసం చోటు చేసుకుంది. గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. బుద్ధుడి విగ్రహాల విధ్వంసం వెనుక నేషనల్ తౌహీత్ జమాత్ ప్రమేయం ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ ఘటన అనంతరం తౌహీత్ జమాత్ పేరు విస్తృతంగా చర్చల్లోకి వచ్చింది. ఆ సంస్థే ఆత్మాహూతి పేలుళ్లకు పాల్పడి ఉండవచ్చంటూ విదేశీ ఇంటెలిజెన్స్ సంస్థ శ్రీలంక ప్రభుత్వాన్ని హెచ్చరించింది.