శ్రీలంక ప్రెసిడెంట్ హత్యకు భారత్ 'రా' కుట్ర కథనం: అబద్దమని మోడీకి సిరిసేన ఫోన్
కొలంబో: శ్రీలంక అధ్యక్షులు మైత్రిపాల సిరిసేనను అంతం చేసేందుకు భారత నిఘా సంస్థ 'రా' పథకం పన్నుతోందని, ఈ విషయాన్ని సిరిసేననే స్వయంగా కేబినెట్ సమావేశంలో వెల్లడించారని ఓ పత్రికలో కథనం వచ్చింది. ఇది దుమారం రేపింది. ఈ విషయం ప్రధాని నరేంద్ర మోడీకి తెలియదని కూడా చెప్పారని పేర్కొన్నారు.
అయితే ఈ వార్తలను సిరిసేన సలహాదారు ఖండించారు. సిరిసేన మాటలను మీడియా వక్రీకరించిందన్నారు. దీనిపై అధ్యక్షుడి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడుతుందన్నారు. కొద్ది రోజుల్లో శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే, ప్రధాని మోడీ మధ్య న్యూఢిల్లీలో సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ ఆరోపణలు రావడం గమనార్హం.
శ్రీలంక నేతలు భారత్ మీద ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి కాదు. 2015లో మాజీ అధ్యక్షులు మహీంద్ర రాజపక్సే కూడా ఇలాంటి ఆరోపణలు చేశారు. తాను అధికారం కోల్పోయి, మరో పార్టీ గద్దెనెక్కడం వెనుక 'రా' హస్తం ఉందన్నారు.
ఇదిలా ఉండగా, శ్రీలంక ప్రెసిడెంట్ సిరిసేన ప్రధాని మోడీకి బుధవారం ఫోన్ చేశారు. తన హత్యకు కుట్ర పన్నడంలో భారత్ పాత్ర ఉందంటూ తాను మాట్లాడలేదని చెప్పారు. అవన్నీ పూర్తి అవాస్తవాలు అన్నారు.