సిరిసేన ఆగ్రహం: ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఎందుకు విస్మరించారు? రాజీనామా చేయండి
శ్రీలంక బాంబు పేలుడు ఘటనలో నిఘా విభాగం విఫలమైందని పేర్కొంటూ ఆ దేశ అధ్యక్షుడు మైత్రిపాల సిరసేన సీరియస్ అయ్యారు. ప్రభుత్వంలోని ఇద్దరు ముఖ్య వ్యక్తులపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీస్ చీఫ్, రక్షణశాఖ కార్యదర్శిలను రాజీనామా చేయాల్సిందిగా అధ్యక్షుడు సిరిసేన కోరినట్లు సమాచారం.
శ్రీలంకలో బాంబు పేలుళ్లు జరిగే అవకాశం ఉందని ఇతర దేశాల నుంచి సమాచారం వచ్చినప్పటికీ తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని సిరిసేన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే డిఫెన్స్ కార్యదర్శి, పోలీస్ చీఫ్లను రాజీనామా చేయమని ఆదేశించినట్లు తెలుస్తోంది. అంతేకాదు భద్రతా దళాల నాయకత్వంలో త్వరలో మార్పులు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు సిరిసేన, ప్రధాని రణిల్ విక్రమసింఘేల మధ్య రాజకీయ విబేధాలు తలెత్తడంతో దేశ భద్రతపై దృష్టి సారించలేకపోయారనే వాదన కూడా వినిపిస్తోంది. దీన్నే అదునుగా తీసుకున్న ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడి నరమేధాన్ని సృష్టంచారని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఈస్టర్ రోజున శ్రీలంకలో పేలిన వరుస బాంబుల ధాటికి 359 మంది మృతి చెందారు. చాలా మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ పేలుళ్లకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు 100 మందిని అరెస్టు చేశారు. పేలుళ్లకు పాల్పడింది తామే అని ఐసిస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఇదిలా ఉంటే న్యూజిలాండ్లోని మసీదులో కాల్పులకు ప్రతీకార చర్యగానే శ్రీలంకలో పేలుళ్లు జరిపారని శ్రీలంక అధికారులు తెలిపారు.మొత్తం ఏడుమంది ఈ ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. అందులో ఒక మహిళ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
President Sirisena says there will be changes in top positions in the security forces in next 24 hours. He says he was not informed about the Intelligence that was received prior to the Terrorist attacks. pic.twitter.com/h3ErYBCJtw
— Azzam Ameen (@AzzamAmeen) April 23, 2019