రణిల్ V/S రాజపక్సే : శ్రీలంక పార్లమెంటు రద్దు చేసిన సిరిసేన...ఏం జరుగుతోంది?
కొలంబో: శ్రీలంకలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. రణిల్ విక్రమసింఘేను ప్రధాని పదవి నుంచి తొలగించి మాజీ అధ్యక్షుడు మహిద రాజపక్సేను ప్రధానిగా నియమించిన తర్వాత ఆదేశంలో పలు పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే శ్రీలంక అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన పార్లమెంటును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. ఈ ఎన్నిక ద్వారా ప్రధానిని ఎన్నుకోవడం జరుగుతుందని వెల్లడించారు.
శ్రీలంకలో రాజకీయ అనిశ్చితి
శ్రీలంకలో పొలిటికల్ క్రైసిస్ వచ్చింది. ప్రధాని పదవి నుంచి రణిల్ విక్రమసింఘేను అధ్యక్షుడు సిరిసేన తొలగించడంతో ఆ దేశ రాజకీయ పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. రణిల్ విక్రమసింఘే స్థానంలో రాజపక్సే నియమించడంతో పరిస్థితి మరింత తీవ్రతరం అయ్యింది. దీంతో 225 స్థానాలున్న పార్లమెంటును రద్దు చేశారు సిరిసేన. అంతేకాదు జనవరి 5న ఎన్నికలు ఉంటాయని తెలిపారు. పార్లమెంటును రద్దు చేస్తున్నట్లు అధికార పత్రాలపై సంతకం కూడా చేశారు సిరిసేన. ప్రధానిగా అవసరమయ్యే మద్దతు మహింద రాజపక్సే తమ పార్టీ నుంచి కూడా లభించకపోవడంతో సిరిసేన ఈ నిర్ణయం తీసుకున్నారు.
అంతర్జాతీయ దేశాల ఒత్తిడి
ఇక గత రెండు వారాలుగా ప్రధాని పదవి కోసం ఇటు రణిల్ విక్రమసింఘే, అటు మహింద రాజపక్సే పోటీ పడుతుండటంతో అక్కడ రాజకీయ అనిశ్చితి నెలకొంది. దీంతో పాలనలో ఇబ్బందులు తలెత్తాయి. ఈ క్రమంలోనే పలు అంతర్జాతీయ దేశాల నుంచి శ్రీలంక పై ఒత్తిడి వస్తోంది. అక్కడ ఆయిల్ దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసెంబ్లీ రద్దు శుక్రవారం అర్థరాత్రి నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది. అంతకుముందే సిరిసేన రాజపక్సే నేతృత్వంలోని కొందరిని మంత్రులుగా తన కేబినెట్లోకి చేర్చుకున్నారు. సాధారణంగా 2020 వరకు ఎన్నికలు జరగకూడదు. కానీ అసెంబ్లీ రద్దుతో జనవరిలోనే ఎన్నికలు జరగనున్నాయి.
రాజపక్సేను ప్రధానిగా నియమించడంతో రాజుకున్న అగ్గి
అక్టోబర్ 26న రాజపక్సేను ప్రధానిగా నియమిస్తూ సిరిసేన నిర్ణయం తీసుకోవడంతో అగ్గిరాజుకుంది. ఇక అప్పటి నుంచి రాజకీయంగా పలు పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అప్పటి వరకు ప్రధానిగా ఉన్న రణిల్ విక్రమసింఘే తన అధికారిక భవనాన్ని వీడేందుకు అంగీకరించలేదు. ఈ క్రమంలోనే రణిల్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏమైనా చేసే అవకాశమున్నందున సిరిసేన పార్లమెంటును కూడా సస్పెండ్ చేశారు. అయితే ప్రధానిగా రాజపక్సేకు ఇంకా 8 మంది అభ్యర్థుల మద్దతు తక్కువగా ఉంది. అయితే ఇతర పార్టీల నుంచి ప్రజాప్రతినిధులు రాజపక్సేకు మద్దుతు తెలిపే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి సిరిసేన-రాజపక్సే వర్గాలు.
సిరిసేన ప్రజాప్రతినిధులకు డబ్బు ఎరవేస్తున్నారనే ఆరోపణలు
ఇదిలా ఉంటే సిరిసేన పార్లమెంటును రద్దు ఎందుకు చేయాల్సి వచ్చిందనే దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇతర పార్టీల నుంచి అభ్యర్థులను తమవైపునకు తిప్పుకునేందుకు చాలా సమయం ఉంటుంది కాబట్టే ఈ చర్యకు పాల్పడ్డారనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికే చాలామంది ప్రజాప్రతినిధులకు డబ్బును ఎరవేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంతేకాదు ఇప్పటికే 8మంది సభ్యులు సిరిసేన వైపునకు వెళ్లారని విపక్ష పార్టీలు చెబుతున్నాయి. తనను తప్పించడం రాజ్యాంగ విరుద్ధమని చెబుతన్న రణిల్ విక్రమసింఘే తనకు తన మిత్రపక్షాలతో కలిసి 120 మంది ఎంపీల మద్దతు ఉందని... సిరిసేన రాజపక్సేలకు 104 మంది ఎంపీల మద్దతే ఉందని చెప్పారు. తనకే మెజార్టీ వస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు రణిల్ విక్రమసింఘే.