శ్రీలంక అధ్యక్షుడికి ఎదురుదెబ్బ.. ప్రధానిగా రాజపక్స ఔట్
కొలంబో : శ్రీలంకలో తాజా పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు ఎదురుదెబ్బ తగలడం చర్చానీయాంశమైంది. ఆయన ప్రధానిగా నియమించిన మహింద రాజపక్సకు చేదు అనుభవం ఎదురైంది. ఆయనను వ్యతిరేకిస్తూ బుధవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే విశ్వాస పరీక్షలో రాజపక్సకు ఓటమి తప్పలేదు.
బల నిరూపణలో రాజపక్స ఘోరంగా విఫలమయ్యారు. మెజార్టీ సభ్యులు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో పార్లమెంట్ లో ప్రభుత్వానికి మెజార్టీ లేదంటూ ప్రకటన చేశారు స్పీకర్ కారు జయసూర్య.
పార్లమెంట్ రద్దుపై స్టే.. ముందస్తు ఎన్నికలకు బ్రేక్
ఈనెల 9న శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన పార్లమెంట్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన నిర్ణయంపై వ్యతిరేకత మొదలయింది. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారంటూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో సిరిసేన నిర్ణయంపై స్టే విధించింది. 2019 జనవరి 5న ముందస్తు ఎన్నికలు నిర్వహించడానికి చేస్తున్న ఏర్పాట్లను వెంటనే ఆపివేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 7కు వాయిదా వేస్తూ.. అప్పటివరకు పార్లమెంట్ రద్దుపై స్టే విధిస్తున్నట్లు ప్రకటించింది సర్వోన్నత న్యాయస్థానం.
సుప్రీం తీర్పుతో స్పెషల్ సెషన్.. రాజపక్స ఔట్
సుప్రీంకోర్టు తీర్పుతో శ్రీలంక పార్లమెంట్ యథావిధిగా కొనసాగుతుంది. సర్వోన్నత న్యాయస్థానం జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత స్పీకర్ జయసూర్య రంగంలోకి దిగారు. బుధవారం పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అయితే రాజపక్సను వ్యతిరేకిస్తూ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో ఆయన బలం నిరూపించుకోలేక ఓడిపోయారు.
పారని మంత్రాంగం.. సిరిసేనకు సుప్రీం దెబ్బ
శ్రీలంక ప్రధానిగా ఉన్న రణిల్ విక్రమ సింఘేను ఆకస్మికంగా పదవిలో నుంచి తొలగించడంతో రాజకీయ సంక్షోభం తలెత్తింది. విక్రమ సింఘేను పక్కనబెట్టి మహింద రాజపక్సను తెరపైకి తేవడంతో కొందరు వ్యతిరేకించారు. అయితే రాజపక్సకు పార్లమెంట్ లో తగిన మెజార్టీ లేకుండా పోయింది. దీంతో పరిస్థితి చేయిదాటకూడదని భావించి సిరిసేన కొత్త ప్రణాళిక రచించారు. పార్లమెంట్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి 2019 జనవరి 5న ముందస్తు ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ నిర్ణయంపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో సిరిసేన మంత్రాంగం పారనట్లయింది.