ట్రంప్ భయం: అమెరికాలో స్థితి మరింత విషమిస్తుందా?
ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నారైల్లో భయాలు ముప్పిరిగొన్నాయి. కూచిభొట్ల హత్యతో అవి మరింత పెరిగాయి. అమెరికాలో 2008 నుంచి 30 మంది తెలుగువాళ్లు మృత్యువాత పడ్డారు.
హైదరాబాద్: తెలుగు టెక్కీ శ్రీనివాస్ కూచిభొట్ల హత్య సంఘటనతో అమెరికాలోని తెలుగువాళ్లలో మరింత భయాందోళనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సంఘటనపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నోరు విప్పకపోవడం కూడా భయాలు పెరగడానికి కారణమవుతున్నాయి. రానున్న రోజులు మరింత భయంకరంగా ఉంటాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.
తెలుగు ఎన్నారైలకు అమెరికాలోని తెలుగు సంఘాలు పలు జాగ్రత్తలు చెబుతున్నాయి. ఇప్పుడు అమెరికాలో ఉన్నవాళ్లు తిరిగిరావడానికి అంతగా ఆసక్తి చూపకపోవచ్చు గానీ, ఇక్కడి నుంచి వెళ్లడానికి మాత్రం ముందుకు రావడం లేదు. అమెరికాలో 2008 నుంచి ఇప్పటి వరకు 30 మంది తెలుగు వాళ్లు వివిధ సంఘటనల్లో మరణించారు.
వాటిలో ముఖ్యమైనవి - 2017 ఫిబ్రవరి 10న వరంగల్కు చెందిన మామిడాల వంశీరెడ్డి కాలిఫోర్నియాలో దుండగుడి దాడికి మరణించాడు. 2016 జూలైలో హైదరాబాద్కు చెందిన 25 ఏళ్ల శ్రీకాంత్ను ఆస్టిన్లోని అతని రూమ్మేట్ కాల్చి చంపాడు. 2015 జూనలో హైదరాబాద్కు చెందిన ఎంఎస్ విద్యార్థి సాయికిరణ్ ఫ్లోరిడాలో జరిగిన కాల్పుల్లో మరణించాడు. అడిగిన వెంటనే ఫోన ఇవ్వనందుకు ఆ దుండగుడు సాయికిరణ్పై కాల్పులు జరిపాడు. 2014లో టెక్సాస్ సమీపంలో ఈలప్రోలు జయచంద్ర మరణించాడు. గ్రాసరీ స్టోర్ దోపిడీ సందర్భంగా దుండగులు జరిపిన కాల్పుల్లో 22 ఏళ్ల జయచంద్ర మరణించారు.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచి వీసా నిబంధనల్లో మార్పులు చేస్తుండడం ఎన్నారైల ఆందోళనకు కారణమవుతోంది. అయితే కాన్సాస్ ఘటన వారిని మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత ఎన్నారైలపై జరిగిన పెద్ద దాడిగా దీన్ని చెప్పుకోవచ్చు.
అమెరికాలో దాదాపు ఆరు లక్షల మంది తెలుగువాళ్లు ఉంటున్నారు. 2016లో 60 వేల మంది భారతీయ విద్యార్థులు స్టూడెంట్ వీసాల మీద అమెరికా వెళ్లినట్లు మీడియాలో వచ్చిన వార్తలు తెలియజేస్తున్నాయి. వారిలో హైదరాబాద్ నుంచే వెళ్లిన వారే ఎక్కువ మంది కావడం విశేషం.
తాజా సంఘటన జరిగిన ప్రాంతమైన కాన్సస్ పట్టణ జనాభా 20 లక్షలు. అక్కడ ప్రవాస భారతీయులు 25 నుంచి 30 వేల వరకు ఉంటారని అంచనా. వీరిలో తెలుగువాళ్లు కూడా ఎక్కువ మందే ఉంటారు. ఈ స్థితిలో ఎన్నారైలు అమెరికాలో జాగ్రత్తగా మసలుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.