ఆ విషయాల్లో జోక్యం వద్దు : పాక్ మిలటరీకి ఆదేశ సుప్రీంకోర్టు భారీ షాక్
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మిలటరీకి ఆదేశ సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది. పాక్ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం మానివేయాలని సూచించింది. చట్టవ్యవహారాల్లో ఐఎస్ఐ ప్రమేయం ఎందుకని ప్రశ్నించింది. అంతేకాదు రాజకీయ కార్యక్రమాలకు కూడా మిలటరీ దూరంగా ఉండాలని ఆదేశించింది. 2017కు సంబంధించిన ఫైజాబాద్ తెహ్రీక్-ఈ-లబ్బైక్ పాకిస్తాన్ ఇంకా ఇతర చిన్న సంస్థల కేసుపై ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఉగ్రవాదం, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని పాక్ ప్రభుత్వానికి సూచించింది.
ఎవరైతే చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతూ ఉగ్రవాదం హింసవైపు అడుగులు వేస్తున్నారో వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని.. చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జస్టిస్ ఖాజీ ఫయాజ్ ఇసా, జస్టిస్ ముషిర్ అలాంలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. అన్ని ప్రభుత్వ విచారణ సంస్థలతో పాటు పాక్ ఆర్మీ కింద పనిచేసే ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్లు కూడా చట్టపరిధిలోనే వ్యవహరించాలని సూచించింది.
త్రివిధ దళాలకు చెందిన వారు క్రియాశీలక రాజకీయాల్లో తలదూర్చరాదని కఠినంగా హెచ్చరించింది కోర్టు. ఏ రాజకీయ పార్టీకి కానీ, ఏ రాజకీయ వ్యక్తికి కానీ కొమ్ము కాయరాదని హెచ్చరించింది పాక్ సుప్రీం కోర్టు. త్రివిధ దళాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే తమ విధులకు వ్యతిరేకంగా చర్యలు చేపడితే వెంటనే వారిని గుర్తించి తొలగించాలని వెల్లడించింది.
ఇదిలా ఉంటే గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు ఆర్మీలోని కొందరు ఉన్నతాధికారులు మద్దతుగా నిలిచారని నిపుణులు భావిస్తున్నారు. 1947లో పాకిస్తాన్కు స్వాతంత్ర్యం లభించిన తర్వా ఆదేశ చరిత్రలో సగానికిపైగా మిలటరీ పాలనే జరిగింది. అంతేకాదు దేశ నిర్ణయాల్లో మిలటరీ కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం.
ఫత్వా పేరుతో ఇతరులకు హానీ చేసేవారిని చట్టపరంగా విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది పాకిస్తాన్ సుప్రీంకోర్టు. అదేసమయంలో పౌరులు చట్టవ్యతిరేక పనులకు పాల్పడకుండా.. తమ నిరసనలు శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చేపట్టొచ్చని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.