అనాటికి అగ్నిగోళంగా భూమి: స్టీఫెన్ హాకింగ్ హెచ్చరిక
వాషింగ్టన్/బీజింగ్: 2600 సంవత్సరం వరకు భూమి అగ్నిగోళంగా మారనుందని ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న జనాభా, విచ్చలవిడి విద్యుత్ వినియోగం ఇందుకు కారణమని స్పష్టం చేశారు. ఈ పరిస్థితి వల్ల భూమిపై మానవ మనుగడ అంతరించిపోనుందని హెచ్చరించారు.
బీజింగ్లో నిర్వహించిన ఓ సదస్సులో వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. మన తర్వాతి తరాలు మరికొన్ని లక్షల సంవత్సరాలు జీవించాలంటే వేరే గ్రహానికి వెళ్లక తప్పదని తేల్చి చెప్పారు. సౌర కుటుంబానికి ఆవల ఉన్న గ్రహానికి తరలిపోవడమే ఇందుకు ఏకైక పరిష్కారమని చెప్పారు. భూమిని పోలి ఉన్న మరో గ్రహానికి ప్రయాణించేందుకు అవసరమయ్యే పరిశోధనలకు సాయం అందించాలని ఇన్వెస్టర్లను కోరారు.
కాగా, భూమిని పోలి, జీవ మనుగుడకు అస్కారమున్న ఆల్ఫా సెంటారీ అనే మరో నక్షత్ర సముదాయం సౌరకుటుంబానికి చేరువలో ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కాంతివేగంతో సమానంగా ప్రయాణించగలిగే చిన్న ఎయిర్క్రాఫ్ట్ను రూపొందించడం ద్వారా రెండు దశాబ్దాల్లో అక్కడకు చేరుకోవచ్చని హాకింగ్ తెలిపారు.
ఈ వ్యవస్థ ద్వారా అంగారక గ్రహంపైకి అరగంటలోనూ, ప్లూటోపైకి కొన్ని రోజుల్లోనూ, ఆల్ఫా సెంటారీ నక్షత్రసముదాయంలోకి 20 ఏళ్లలోనూ చేరుకోవచ్చని స్టీఫెన్ హాకింగ్ వివరించారు. అక్కడ భూమిని పోలిన గ్రహం ఉండే అవకాశముందని అందులో నివాసం ఏర్పరచుకునే అవకాశాలను అన్వేషించాలని ఆయన పేర్కొన్నారు.