ఆప్ఘన్లో అమెరికా బలగాల ఉపసంహరణ- హామీకి కట్టుబడాలని బిడెన్ను కోరిన తాలిబన్లు...
ఆప్ఘనిస్తాన్లో స్ధానిక ప్రభుత్వాలను కూలదోసి తమ చెప్పుచేతల్లో ఉండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అమెరికా దశాబ్దం గడిచినా అక్కడ శాంతిని నెలకొల్పడంలో విఫలమవుతూనే ఉంది. పరాయిదేశ వ్యవహారాల్లో తలదూర్చడమే కాకుండా అక్కడ వేలాది మంది బలగాలను సైతం స్ధానిక ప్రభుత్వానికి కాపలాగా ఉంచింది. దీనికి పర్యవసానంగా వారు తాలిబన్ల చేతిలో బలవుతున్నారు. దీంతో అమెరికా ఎన్నికల్లో ఇదే ప్రచారాంశంగా మారిపోయింది. ఈ ఏడాది క్రిస్టమస్ నాటికి ఆప్ఘన్లో పోరుకు ముగింపు పలుకుతామని అధ్యక్ష అభ్యర్ధులు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ కూడా హామీ ఇచ్చారు.
ఇప్పుడు అమెరికా అధ్యక్ష అభ్యర్ధులు ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని తాలిబన్లు కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ను కోరుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే అమెరికా భద్రతా సలహాదారు మాత్రం అదంత సులువు కాదని, ఓసారి బలగాల ఉపసంహరణ ప్రక్రియ మొదలుపెడితే వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి అది పూర్తి కావచ్చని తాజాగా ప్రకటించారు. దీంతో కాబోయే అధ్యక్షుడు బైడెన్పై ఒత్తిడి పెంచేందుకే తాలిబన్లు ఈ ప్రకటన విడుదల చేసి ఉంటారని భావిస్తున్నారు. తాలిబన్ల ప్రకటనపై బైడెన్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
Recommended Video
వాస్తవానికి ఆప్ఘనిస్తాన్లో స్ధానిక ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తాలిబన్లు నిరంతరం దాడులకు దిగుతున్నారు. అమెరికా బలగాలు వీరిని అడ్డుకుని ప్రతిదాడులకు దిగుతున్నాయి. దీని వల్ల భారీగా ఆస్తి, ప్రాణ నష్టాలు కూడా తప్పడం లేదు. ఇందులో స్ధానికంగా భూభాగాలపై పట్టున్న తాలిబన్ల కంటే అమెరికన్ బలగాలకే ఎక్కువ నష్టం వాటిల్లుతోంది. అయినా విధానపరమైన నిర్ణయంలో భాగంగా తాము అక్కడ బలగాలు కొనసాగిస్తున్నట్లు అమెరికా చెబుతోంది. కానీ ఇప్పటికే ఆర్ధికంగా ఇబ్బందుల్లో చిక్కుకున్న అమెరికా.. ఆప్ఘన్లో తమ బలగాలను కొనసాగించడం మంచిది కాదని భావిస్తోంది.