గురుద్వారాలో సిక్కుల ప్రార్థనలు, రాళ్లతో దాడి చేస్తోన్న ముస్లింలు, నంకానా సాహిబ్ వద్ద హై టెన్షన్..
పాకిస్థాన్లోని నంకనా సాహిబ్ గురుద్వారా వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. మందిరంలో సిక్కులు ప్రార్థనలు చేస్తున్న సమయంలో కొందరు ముస్లింలు రాళ్లతో దాడులు చేస్తున్నారు. దీంతో లోపల ఉన్న సిక్కులు భయంతో గజ గజ వణికిపోతున్నారు. నంకనా సాహిబ్లో ఒక్క సిక్కు లేకుండా చేస్తామని ముస్లింలు నినాదాలు చేస్తున్నారు
టెన్షన్.. టెన్షన్
మహ్మద్ హస్సన్ నేతృత్వంలో గురుద్వారాపై రాళ్లతో దాడులకు దిగారు. మహ్మద్ కుమారుడు ఇటీవల గురుద్వారా పతి కుమార్తె జగజిత్ కౌర్ను అపహరించి, మతం మార్చారు. దీంతో కలకలం రేగింది. తర్వాత ముస్లిం-సిక్కుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి మహ్మద్ హస్సన్, ఇతరులతో కలిసి రాళ్లతో దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
గురుద్వారాను కూల్చేస్తాం..
శుక్రవారం 7 గంటల సమయంలో మహ్మద్ హస్సన్ సహా కొందరు గుమిగూడి గురుద్వారాపై రాళ్లతో విరుచుకుపడుతున్నారు. అంతేకాదు గురుద్వారాను కూల్చివేస్తామని నినాదాలు చేస్తున్నారు. ఆందోళనకారులు దాడులు చేస్తున్న సమయంలో తీసిన వీడియో ఒకటి ట్రోల్ అవుతోంది. అందులో ఆందోళనకారులు నంకనా సాహిబ్ కాస్త గులామన్-ఏ-ముస్తాఫాగా మారుస్తామని చెప్తున్నారు.
రంగంలోకి పోలీసులు
నంకనా సాహిబ్లో సిక్కులు ఉండొద్దని, ఇకపై ఉండబోరని నినాదాలు చేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు, పాకిస్థాన్ రేంజర్లు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. కానీ కడపటి సమాచారం అందేవరకు కూడా సిక్కులు గురుద్వారాలోనే ఉన్నట్టు తెలుస్తోంది. సిక్కుల గురువు గురుగోబింద్ సింగ్ జయంతి మరునాడే నంకనా సాహిబ్లో ఘటన జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
సిక్కులే ఎక్కువ
పాకిస్థాన్లోని నంకనా సాహిబ్ సిక్కుల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉంటోంది. సిక్కుల మొదటి మత గురువు గురునానక్ దేవ్ 1469లో ఇక్కడే జన్మించారు. ఈ ప్రాంతం అంటే సిక్కులు పవిత్రంగా భావిస్తారు. అధిక సంఖ్యలో సిక్కులు కూడా నివసిస్తారు. వారి ప్రాతినిధ్యం ఎక్కువవుతోన్న క్రమంలో అడ్డుకొనేందుకు ముస్లింలు దాడులకు తెగబడుతున్నారు.