పాకిస్తాన్ కు భారత్, అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్!
తన భూభాగాన్ని వేదికగా చేసుకొని సీమాంతర ఉగ్రవాద దాడులు జరగకుండా పాకిస్తాన్ చర్యలు తీసుకోవాలని అమెరికా, భారత్ గట్టిగా సూచించాయి. ఇరు దేశాల అధినేతలు ఈ మేరకు ఒక ఉమ్మడి ప్రకటనలో పాక్ ను కోరారు.
వాషింగ్టన్: పాకిస్తాన్ కు భారత్, అమెరికా ఉమ్మడిగా గట్టి సందేశాన్ని ఇచ్చాయి. తన భూభాగాన్ని వేదికగా చేసుకొని సీమాంతర ఉగ్రవాద దాడులు జరగకుండా పాకిస్తాన్ చర్యలు తీసుకోవాలని గట్టిగా సూచించాయి. 26/6 ముంబై దాడులు, పఠాన్కోట్ ఉగ్రవాద దాడి సూత్రధారులను చట్టం ముందుకు తెచ్చి సత్వరమే శిక్షించాలని డిమాండ్ చేశాయి.
ఉగ్రవాదంపై పోరాటాన్ని మరింత ముమ్మరం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని, ఉగ్రవాదుల స్వర్గధామాలను నిర్మూలిస్తామని ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉమ్మడిగా ప్రతినబూనారు.
'ఉగ్రవాద నిర్మూలనే మాకు అత్యంత ప్రాధాన్య విషయం' అని ట్రంప్తో కలిసి సంయుక్త ప్రకటన చేస్తూ ప్రధాని మోడీ పేర్కొన్నారు. తన భూభాగం వేదికగా చేసుకొని ఇతర దేశాలపై ఉగ్రవాద దాడులు జరగకుండా పాక్ చర్యలు తీసుకోవాలని ఇరువురు నేతల తమ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు.
'మేం ఉగ్రవాదం, తీవ్రవాదం, అతివాదం గురించి చర్చించాం. ఈ విషయాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నాం' అని మోడీ పేర్కొన్నారు. ఉగ్రవాద సంస్థలను, వాటిని నడిపించే భావజాలాన్ని ధ్వంసం చేయాలని ఇరుదేశాలూ నిశ్చయించినట్టు ట్రంప్ తెలిపారు.