ఇండోనేషియాలో భారీ భూకంపం.. తప్పిన సునామీ ప్రమాదం..
ప్రకృతి విపత్తులు తరచూ సంభవించే ఇండోనేషియాలో మరోసారి భూకంపం వచ్చింది. భారీ ప్రకంపనలు రావడంతో జనం భయంతో వణికిపోయారు. ఈశాన్య కోస్తా ప్రాంతంలోని మలుకు - సులవేసి దీవుల్లో భారీ ప్రకంపనలు వచ్చాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైంది. మనాడోకి ఆగ్నేయ దిశగా 185కిలోమీటర్ల దూరంలో భూమికి 24 కి.మీల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
నిద్రమత్తులో డ్రైవర్.. కాల్వలో పడిపోయిన బస్సు.. 29 మంది మృతి
భారీ భూకంపం వచ్చినా దాని వల్ల ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే ఆస్తి నష్టం గురించి ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు. భూకంపం కారణంగా జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీయడంతో ప్రాణ నష్టం తప్పినట్లు తెలుస్తోంది. భూకంపం నేపథ్యంలో ఇండోనేషియాకు సునామీ హెచ్చరికలు జారీ చేసిన అధికారులు ఆ తర్వాత ఉపసంహరించుకున్నారు. సునామీ హెచ్చరికలు వెనక్కి తీసుకోవడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు.
ఇండోనేషియాలో ప్రకృతి విపత్తులు తరుచూ చోటు చేసుకుంటాయి. 2004లో సుమత్రా దీవుల్లో వచ్చిన సునామీ కారణంగా 1,68,000 మంది మృత్యువాత పడ్డారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద విపత్తుగా ఇది రికార్డుకెక్కింది. గతేడాది సులవేసిలో 7.1 తీవ్రతతో వచ్చిన భూకంపంలో 2200మంది చనిపోయారు. మరో వెయ్యి మంది గల్లంతయ్యారు.