పెరూలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్పై 8.0 నమోదు
పెరూ : ఉత్తర మధ్య పెరూలో అతిపెద్ద భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 8.0గా నమోదైంది. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల 41 నిమిషాలకు భూకంపం వచ్చింది. ఆ మేరకు యూఎస్ భూగర్భ పరిశోధన సంస్థ వివరాలు వెల్లడించింది. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో అధికారులు అలర్టయ్యారు.
భూకంపానికి సంబంధించి పెరూ ప్రభుత్వం కూడా స్పందించింది. ట్విట్టర్ వేదికగా వివరాలు వెల్లడించింది. తొలుత రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 7.2గా నమోదైందని పేర్కొంది. కల్లావు, లిమా తదితర ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నట్లు తెలిపింది. అయితే ఈ భూకంపం వల్ల సునామీ వచ్చే ప్రమాదమైతే లేదని వివరించారు అధికారులు.
పెరూలో సంభవించిన భూకంపానికి సంబంధించి అక్కడి సోషల్ మీడియాలో నెటిజన్లు స్పందిస్తున్నారు. రెండు, మూడు నిమిషాల పాటు భూప్రకంపనలు రావడంతో ఇళ్లల్లోనుంచి బయటకు పరుగులు తీశామని పేర్కొంటున్నారు. ఆగ్నేయ ల్యాగునాస్కు కేవలం 80 కిలోమీటర్ల పరిధిలో, అలాగే యురిమ్యాగాస్ సిటీకి 160 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రీకృతమై ఉన్నట్లు సమాచారం. డెప్త్ పరంగా 114 కిలోమీటర్ల లోతుగా ఉన్నట్లు తెలుస్తోంది.