ఇండోనేషియాలో 6.9తీవ్రతతో భూకంపం: జనం పరుగులు
జకార్తా: ఇండోనేషియాలోని అంబన్ ద్వీపం సమీపంలోని సముద్ర గర్భంలో భూకంపం సంభవించింది. ఆ ద్వీపానికి 174 కిలోమీటర్ల దూరంలో ఉత్తర బండా సముద్రంలో 20కిలోమీటర్ల లోతున ఈ భూకంప కేంద్రం ఉంది.
రెక్టార్ స్కేలుపై దీని తీవ్రత 6.9గా నమోదైందని అమెరికా జియోలాజికల్ సర్వే(యూఎస్జిఎస్) వెల్లడించింది. స్థానిక కాలమానం ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం 12.21 ప్రాంతంలో అక్కడ భూమి కంపించింది.
అయితే ముందు 7.1 తీవ్రతతో అక్కడ భూకంపం సంభవించిందని చెప్పిన యూఎస్జిఎస్ కొంత సేపటికే 6.9కి సవరించింది. భూకంపం కారణంగా ఇళ్లు, కార్యాలయాల నుంచి ప్రజలు బయటికి పరుగులు తీశారు.
కాగా, ఈ భూకంపంతో ఎలాంటి నష్టం జరిగినట్లు ఇప్పటి వరకు వార్తలు అందలేదు. దీని ప్రభావం వల్ల సమీప దేశమైన ఆస్ట్రేలియాకు సునామీ ప్రమాదం ఏమీ లేదని ఆ దేశ వాతావరణ శాఖ తెలిపింది. కాగా, స్వల్ప సునామీ వచ్చే అవకాశముందని సిస్మోలజిస్టులు చెబుతున్నారు.