భయోత్పాతం... అమెరికాలో కోవిడ్ 19 పార్టీలు... వైరస్ వ్యాప్తి చెందిస్తున్న స్టూడెంట్స్...
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు లాక్ డౌన్ పాటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే చాలా దేశాలు లాక్ డౌన్ నుంచి బయటకొస్తున్నాయి. అయితే అన్లాక్ ప్రకటించినంత మాత్రాన నిర్లక్ష్యం వహించవద్దని... కోవిడ్ 19 ఎప్పుడు ఎక్కడ అంటుకుంటుందో తెలియదని ప్రభుత్వాలు,ఆరోగ్య సంస్థలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. అయినా సరే,కొంతమందికి మాత్రం అవేవీ చెవికెక్కట్లేదు. ముఖ్యంగా అమెరికాలోని అలబామా రాష్ట్రానికి చెందిన కాలేజీ స్టూడెంట్స్ కోవిడ్-19 తోనే పరాచకాలు మొదలుపెట్టారు.
ఇంతకీ ఏం చేస్తున్నారు...
అలబామా రాష్ట్రంలోని పలు కాలేజీలకు చెందిన స్టూడెంట్స్ ఇటీవల కోవిడ్ 19 పార్టీలు నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు. ఈ పార్టీలకు కోవిడ్ 19 పేషెంట్లను ఆహ్వానించారు. పార్టీకి హాజరైనవారిలో మొదట ఎవరికి కరోనా సోకుతుందో వారికి ప్రైజ్ మనీ అందిస్తున్నారు. టుస్కాలోసా సిటీ కౌన్సిలర్ సోన్య మెకిన్స్ట్రీ దీనిపై మాట్లాడుతూ.. విద్యార్థులు ఉద్దేశపూర్వకంగా కరోనాను వ్యాప్తి చేసేందుకే ఈ పార్టీలు నిర్వహించారని చెప్పారు.
మొదట వైరస్ సోకినవారికి ప్రైజ్ మనీ...
'నిజానికి ఇదంతా వట్టి పుకారేనని మొదట్లో మేము భావించాం. అయితే దీనిపై కొంత రీసెర్చ్ చేశాక అసలు నిజాలు తెలిశాయి. స్థానిక డాక్టర్లే కాదు,అధికారులు కూడా ఇది నిజమేనని చెప్పారు.' అని సోన్య పేర్కొన్నారు. ఈ పార్టీలకు విద్యార్థులు కావాలనే కోవిడ్ 19 పేషెంట్లను ఆహ్వానిస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ఒక కుండలో భారీ మొత్తంలో డబ్బు పెట్టి.. మొదట కోవిడ్ 19 పేషెంట్తో దాన్ని టచ్ చేయిస్తున్నారని తెలిపారు. ఆ తర్వాత, పార్టీకి హాజరైనవారిలో ఎవరికైతే వైద్య పరీక్షల్లో కోవిడ్ 19 పాజిటివ్గా నిర్దారణ అవుతుందో... ఆ కుండలోని డబ్బును వారికి ప్రైజ్ మనీగా అందజేస్తున్నారని చెప్పారు.
అత్యంత బాధ్యతారాహిత్యంగా...
గత కొద్ది వారాలుగా టుస్కలోసాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ రకమైన పార్టీలు జరుగుతున్నట్లు చెప్పారు. ఇదంతా చూస్తుంటే భయోత్పాతం కలుగుతోందన్నారు. ఒక ప్రాణాంతక వైరస్ పట్ల చదువుకున్న విద్యార్థులు ఇలా వ్యవహరించడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఇది అత్యంత బాధ్యతరాహిత్యం అని... పార్టీలకు వెళ్లి వైరస్ అంటించుకుని,ఆపై ఇంట్లో వాళ్లకు కూడా వ్యాప్తి చేస్తున్నారని అన్నారు.
Recommended Video
అలబామాలో 30వేల కేసులు
అలాబామా స్టేట్లో ఇప్పటివరకూ 39వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ కరోనాతో సుమారు 1000 మంది మృతి చెందారు. కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో... ఇలా విద్యార్థులు ఉద్దేశపూర్వకంగా వైరస్ను వ్యాప్తి చెందిస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.కోవిడ్ 19 వైరస్కు చికిత్స లేదని తెలిసినా విద్యార్థులు ఇలా వ్యవహరించడం దారుణమని సోన్య అన్నారు. స్థానిక అధికారులు కోవిడ్ 19 పార్టీలను భగ్నం చేసే పనిలో నిమగ్నమైనట్లు తెలిపారు.