అలర్ట్: గర్భిణీ స్త్రీలకు కరోనా సోకే ప్రమాదం 70 శాతం ఎక్కువ, వ్యాక్సిన్ కూడా రిస్కే
న్యూయార్క్: కరోనా మహమ్మారికి వ్యాక్సిన్లు వచ్చినప్పటికీ కరోనావైరస్ మాత్రం ఇంకా ప్రపంచాన్ని పూర్తిగా వీడలేదు. ప్రపంచంలోనే అమెరికాలో అత్యధిక కరోనా కేసులు, మరణాలున్నాయి. అమెరికా తర్వాత భారత్లోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. అయితే, మనదేశంలో కోలుకుంటున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటం, కొత్తగా నమోదవుతున్న కేసులు స్వల్పంగా ఉండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా పడిపోయింది. కాగా, కరోనాపై ఇంకా శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగిస్తూనే ఉన్నారు.
తాజాగా, అమెరికాలో జరిపిన తాజా అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. గర్భిణీ మహిళలకు కరోనా మహమ్మారి సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆ అధ్యయనంలో తేలింది. అమెరికన్ జర్నల్ ఆఫ్ ఆబ్సస్టెట్రెక్స్ అండ్ గైనకాలజీ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. సాధారణ మహిళల కన్నా 70 శాతం ఎక్కువగా గర్భిణీలు కరోనా బారినపడే అవకాశం ఉందని తేల్చింది.
అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఈ మేరకు తమ అధ్యయనంలో తేలిందని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ రీసెర్చర్ క్రిస్టీనా ఆడమ్స్ తెలిపారు. గర్భిణీ స్త్రీలు మహమ్మారికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కరోనా సోకితే గర్భిణీలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని, డెలివరీ సమయంలో మరణించే అవకాశం కూడా లేకపోలేదని పేర్కొన్నారు.
కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం కూడా గర్బిణీ స్త్రీలకు రిస్క్తో కూడకున్న ప్రక్రియ అని ఆడమ్స్ తెలిపారు. 35 ఆస్పత్రులు, క్లినిక్స్లలో ఈ స్టడీని నిర్వహించారు. జూన్ 2020 నుంచి ఇప్పటి వరకు 240 మంది గర్భిణీలు కరోనా బారినపడ్డారని తెలిపారు. గర్భిణీలు వ్యాక్సిన్ తీసుకునే ముందు వైద్యుల సూచనలు తీసుకోవాలని, ఆ తర్వాత వ్యాక్సిన్ తీసుకునేందుకు సిద్ధపడాలని సూచించారు.