మస్ట్ రీడ్ : భారత్ పాక్ల మధ్య అణుయుద్ధమే వస్తే పరిణామాలు ఎలా ఉంటాయి?
వాషింగ్టన్: జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ భారత్పై విషం చిమ్ముతున్న సంగతి తెలిసిందే. పలు అంతర్జాతీయ వేదికలపై కూడా భారత్ పై తనకున్న ఆగ్రహంను బయటపెట్టింది. ఇక ఈ మధ్య కాలంలో పాక్ ప్రధాని అవసరమైతే యుద్ధానికి దిగుతాం.. అది కాకుంటే అణుయుద్ధం చేస్తామంటూ పదే పదే మాట్లాడుతున్నారు. కానీ యుద్ధమే వస్తే ఇరు దేశాల మధ్య ఎలాంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది అనేదానిపై జర్నల్ సైన్సెస్ అడ్వాన్సెస్లో ఓ స్టడీ ప్రచురితమైంది.
పదే పదే రెచ్చిపోతున్న పాక్
భారత్ - పాకిస్తాన్ల మధ్య గత కొద్దిరోజులుగా యుద్ధ వాతావరణం అలుముకుంది. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయగానే రెండు దేశాల మధ్య వైరం మరింత పెరిగింది. వాస్తవానికి జమ్మూకశ్మీర్ అంశం భారత అంతర్గత విషమైనప్పటికీ పాకిస్తాన్ మాత్రం అదేదో తమదే అన్నట్లుగా అంతర్జాతీయ వేదికలపై మొసలి కన్నీరు కారుస్తోంది. ఈ క్రమంలోనే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రసంగించిన ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్పై యుద్ధం గురించి ప్రస్తావించారు. అంతకుముందు పాకిస్తాన్ అణుయుద్ధానికి దిగుతామని బెదిరించే ప్రయత్నం చేసింది.
100 మిలియన్కు పైగా ప్రజలు మృతి చెందుతారు
ఒక వేళ నిజంగానే అణుయుద్ధం వస్తే రెండు దేశాల్లో కలిపి 100 మిలియన్ మంది అమాయక ప్రజలు చనిపోతారని జర్నల్ సైన్స్ అడ్వాన్స్లో ఓ కథనం ప్రచురితమైంది. అంతేకాదు ఈ రెండు దేశాల మధ్య అణుయుద్ధం జరిగితే ఆ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా పడుతుందని తద్వారా ఆకలి చావులు కూడా పెరిగిపోతాయని పేర్కొంది. ఇప్పటికే రెండు దేశాలు కశ్మీర్ ప్రధానాంశంగా చాలా యుద్ధాలు చేశాయి.2025 నాటికి రెండు దేశాలకు కలిపి 400 నుంచి 500 మధ్య అణ్వాయుధాలు ఉంటాయని వెల్లడించింది.
విషవాయువు విడుదలయ్యే అవకాశం
ఇరు దేశాల మధ్య అణుయుద్ధం జరిగి అణుబాంబులు పేలితే గాల్లోకి 16 నుంచి 36 మిలియన్ల కార్బన్ పార్టికల్స్ను విడుదల చేస్తాయని రట్జర్స్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు చెప్పారు. ఈ కార్బన్ పార్టికల్స్ గాల్లోకి విడుదలైతే వారం రోజుల సమయంలో ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తాయని పరిశోధకులు చెప్పారు. గాల్లోకి విడుదలైన ఈ కార్బన్ పార్టికల్స్ సోలార్ రేడియేషన్స్ను పీల్చేసి ఆ తర్వాత గాలిలో ఉష్ణోగ్రతను పెంచుతాయని పరిశోధకులు చెబుతున్నారు.
సూర్యకిరణాలను అడ్డుకునే కార్బన్ పార్టికల్స్
ఇలా ఈ కార్బన్ పార్టికల్స్ వ్యాప్తి చెందేసమయంలో సూర్యుడినుంచి వచ్చే కిరణాలను భూమిని తాకకుండా అడ్డుకుంటాయని చెప్పారు. ఇలా 15 నుంచి 30శాతం వరకు సూర్యకిరణాలు భూమిని తాకకుండా పోతాయని చెప్పారు. దీంతో భూమిపై ఉష్ణోగ్రత 2 నుంచి డిగ్రీల సెల్సియస్ మేరా తగ్గుతుందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా కురిసే వర్షాలు కూడా 15శాతం నుంచి 30 శాతంకు పడిపోతాయని చెప్పారు. ఇదే జరిగితే వాతావరణంలో తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటాయని చెప్పారు.
సాధారణ స్థాయికి చేరుకునేందుకు 10 ఏళ్ల సమయం
ఇక వృక్షసంపద కూడా 15 శాతం నుంచి 30శాతంకు తగ్గిపోతుందని పరిశోధకులు చెప్పారు. మహాసముద్రాల ఉత్పదకత కూడా 5 నుంచి 15శాతంకు పడిపోతుందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే దీన్నుంచి తిరిగి సాధారణ స్థాయికి చేరుకునేందుకు దాదాపు 10 ఏళ్లు సమయం పడుతుందని చెప్పారు. దాదాపు 9 దేశాలు అణ్వాయుధాలు కలిగి ఉన్నాయని అయితే పాకిస్తాన్ భారత్లు మాత్రమే తరుచూ అణుయుద్ధం గురించి పదేపదే మాట్లాడుతున్నాయని పరిశోధకుడు రాబాక్ చెప్పారు.
హిరోషిమా బాంబుతో సమానం
కశ్మీర్ అంశంపై ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం నడుస్తోందని అణుయుద్ధం అనే మాట పదేపదే వినిపిస్తుండటంతో దాని తీవ్రత ఎలా ఉంటుందో అనేదానిపై స్టడీ చేసినట్లు చెప్పారు. 2025లో అణ్వాయుధాల పరిధి 15 కిలోటన్నులు మేరా ఉండే అవకాశం ఉందని దీని పరిమితి హిరోషిమాపై 1945లో అమెరికా వేసిన అణుబాంబు అంత ఉంటుందని చెప్పారు. ఇది కొన్ని వందల కిలోల టన్నుల వరకు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. అణుయుద్ధమే వస్తే దీని వల్ల 50 నుంచి 125 మిలియన్ మంది నేరుగా ప్రాణాలు కోల్పోనుండగా... ఆ తర్వాత వచ్చే కరువుతో చాలామంది చనిపోతారని పరిశోధకులు చెబుతున్నారు.