అవమానాలు పక్కన పెట్టి మస్సాచుసెట్స్ కాలేజీకి: చాయ్వాలా అమ్మాయికి రూ.3.8 కోట్ల స్కాలర్షిప్
లక్నో: చాయ్ అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న ఓ వ్యక్తి కూతురుకు అమెరికా మస్సాచుసెట్స్లోని బాబ్సన్ కళాశాలలో స్కాలర్షిప్ వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని బులందషహర్కు చెందిన సుదీక్ష భాటి పన్నెండో తరగతిలో 98 శాతం మార్కులు తెచ్చుకొని జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఇది ఆమెకు రూ.3.8 కోట్ల స్కాలర్షిప్ తెచ్చిపెట్టింది. ప్రతిష్టాత్మక బాబ్సన్ కాలేజీలో చదివే అవకాశం అందించింది.
సుదీక్షా భాటిది పేద కుటుంబం. తండ్రి ప్రతి రోజు చాయలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆమెకు తొమ్మిదేళ్ల వయస్సు ఉన్నప్పుడు స్కూల్ ఫీజు కట్టలేదు. దీంతో స్కూల్ యాజమాన్యం ఆమెను ఇంటికి పంపించింది. ఆ తర్వాత తండ్రి ఆమెను ఊళ్లోని ప్రాథమిక పాఠశాలలో చేర్పించాడు. డబ్బు కట్టలేక ఆ పాఠశాలకు వెళ్తున్న ఆమెను కొందరు హేళన చేసేవారు. అమ్మాయిలకు చదువు అవసరమా అన్న వారు కూడా ఉన్నారు.
అన్ని అవమానాలు పక్కన పెట్టి సుదీక్ష ఎంతో కష్టపడి చదివింది. మంచి మార్కులతో అయిదో తరగతి పాసైంది. ఆ సమయంలోనే శివనాడార్ ఫౌండేషన్ సుదీక్షకు చేయూతనందించింది. ఈ సంస్థ గ్రామీణ భారతంలో ఆర్థికంగా వెనుకబడి చదువుకోలేని తెలివైన విద్యార్థులకు సాయం చేస్తుంటుంది. అలా ఆ సంస్థ సాయంతో విద్యాజ్ఞాన్ పాఠశాలలో చదివింది.
ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు సమ్మర్లో నిర్వహించే డ్యూక్ టిప్ (ఇండియా), పెన్సిల్వేనియా స్కూల్ ఫర్ గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ (లెహెగ్, యూఎస్ఏ)లలో పాల్గొన్నది. పాఠశాలలో చదువుతున్నప్పుడే అమ్మాయిలను స్కూల్కి పంపించమని వాయిస్ ఆఫ్ విమెన్ పేరిట ఒక అవగాహనా కార్యక్రమాన్నీ నిర్వహించింది.