ఫుట్బాల్ మ్యాచ్ వద్ద ఆత్మాహుతి: మేయర్తో సహా 30మంది మృతి
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ సమీపంలో ఇస్లామిక్(ఐఎస్) ఉగ్రవాదులు మరోసారి మారణహోమం సృష్టించారు. స్థానికంగా జరుగుతున్న ఓ ఫుట్బాల్ మ్యాచ్ వద్ద ఆత్మాహతి దాడులు జరిపారు. ఈ ఘటనలో నగర మేయర్ సహా 30 మంది మృతి చెందారు.
ఇస్కాన్దరియా నగర సమీపంలోని ఓ గ్రామంలో స్థానిక ఫుట్బాల్ పోటీలు జరుగుతున్నాయి. మ్యాచ్ అనంతరం విజేతకు ట్రోఫీ అందజేస్తుండగా.. ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. పేలుడు శబ్ధం వినగానే.. ప్రజలంతా ఆందోళన చెందుతూ పరుగులు తీశారు.
ఈ ఘటనలో నగర మేయర్ సహా 30 మంది మృతిచెందగా.. మరో 65 మందికి పైగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఐఎస్ ఉగ్రవాదులే దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
యెమెన్లో ఆత్మాహుతి దాడులు: 26 మంది మృతి
యెమెన్లోని అడెన్ నగరంలో వరుస ఆత్మాహుతి దాడులు జరిగాయి. భద్రతాసిబ్బంది లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
బురైఖా ప్రాంతంలోని చెక్పాయింట్ వద్ద భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా.. పేలుడు పదార్థాలతో వచ్చిన ఓ అంబులెన్స్ను గుర్తించారు. అంబులెన్స్ డోర్ను తెరిచేలోపే.. అందులో ఉన్న వ్యక్తి తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఘటనలో 14 మంది మృతిచెందారు.
ఈ ఘటన జరిగిన కొద్ది సేపటికే చెక్పాయింట్ సమీపంలో మరో రెండుఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 12 మంది మృతిచెందారు. మరికొందరు గాయపడినట్లు అధికారులు తెలిపారు. దాడులకు బాధ్యత వహిస్తూ.. ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ప్రకటించింది.