పోలీస్ అకాడమీలో ఉగ్రదాడి: 13మంది మృతి
మొగాదిషు: సోమాలియా రాజధాని మొగాదిషులో గురువారం ఉగ్రదాడి జరిగింది. స్థానిక పోలీసు శిక్షణ శిబిరంలో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి తెగబడటంతో సుమారు 13 మంది మృతిచెందారు.
స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జనరల్ కహియే పోలీస్ శిక్షణా కేంద్రంలో గురువారం ఉదయం పోలీస్ పరేడ్ జరుగుతుండగా శరీరానికి పేలుడు పదార్థాలు చుట్టుకున్న ఓ ఆగంతకుడు ప్రాంగణంలోకి చొరబడ్డాడు.
అనంతరం తనను తాను పేల్చుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఇప్పటివరకు 13 మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్నారు. గాయపడిన మరో 15 మందిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
దుండగుడు పోలీస్ దుస్తుల్లో వచ్చినట్లు అధికారులు తెలిపారు. కాగా, దాడికి పాల్పడింది తామేనంటూ ఉగ్రవాద సంస్థ అల్ షబాబ్ ప్రకటించుకుంది. ఈ సంస్థ సోమాలియాలో గత కొంత కాలంగా మారణహోమాన్ని సృష్టిస్తోంది.