అఫ్గన్లో మరో ఆత్మాహుతి దాడి: 11మంది చిన్నారులు బలి
కాబూల్: ఆఫ్గనిస్తాన్ పేలుళ్లతో దద్దరిల్లుతోంది. సోమవారం జంట పేలుళ్లు సంభవించిన గంటల వ్యవధిలోనే కాందహార్ పట్టణంలో మరో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 11మంది చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు.
నెత్తురోడిన కాబూల్: బాంబు పేలుళ్లలో 29మంది మృతి..
కాందహార్ లోని డమన్ కి చెందిన రొమేనియన్ పెట్రోలింగ్ కాన్వాయ్ ను లక్ష్యంగా చేసుకుని ఈ ఆత్మాహుతి దాడి జరిగినట్టు తెలుస్తోంది. స్థానిక అధికారులు సైతం ఇదే విషయాన్ని వెల్లడించారు. పేలుడు సంభవించిన ప్రాంతానికి సమీపంలోనే ఓ స్కూల్ కూడా ఉంది. అయితే ఆ సమయంలో చిన్నారులంతా లోపలే ఉండటంతో పెనుప్రమాదం తప్పింది.
ఘటనలో మొత్తం 11మంది చిన్నారులు మృతి చెందగా.. మరో 16 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఐదుగురు రొమేనియా సైనికులు, ఇద్దరు అఫ్గాన్ పోలీసులు ఉన్నట్టు సమాచారం.
కాగా, గతేడాది సెప్టెంబర్ లోనూ కాందహార్ లో కారు బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు రొమేనియన్ సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. తాజా పేలుళ్లు ఎవరి పని అయి ఉంటుందన్నది ఇంకా తేలలేదు.