కాబుల్ లో బాంబుల మోత: ఎయిర్ పోర్టు టార్గెట్
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ నగరం బాంబుల మోతతో దద్దరిల్లుతున్నది. సోమవారం ఉదయం కాబూల్ లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో భారీ బాంబు పేలుడు జరిగింది.
ఈ బాంబు పేలుడు వల్ల సంఘటనా స్థలంలో ఒకరు దుర్మరణం చెందాడు. పలువురికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. అంతర్జాతీయ విమానాశ్రయం వైపు కారులో దూసుకు వచ్చిన ఉగ్రవాది బాంబు పేలుడు సృష్టించాడు.
హమీద్ కర్జాయ్ విమానాశ్రయం సమీపంలో బాంబు పేలుడు జరిగిందని అఫ్ఘనిస్థాన్ హోం మంత్రిత్వ శాఖ నిర్ధారించింది. ముందు జాగ్రత చర్యగా కాబూల్ నగరంలో రద్దీగా ఉన్న ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.
పలు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. అఫ్ఘనిస్థాన్ లోని హెల్మండ్ రాష్ట్రంలోని లష్కర్ గా ప్రాంతంలో ఆదివారం బాంబు పేలుళ్లు జరిగాయి. రోజువారీ పెట్రోలింగ్ విధుల్లో ఉన్న ఇద్దరు పోలీసులతో సహ ముగ్గురు మరణించారని అధికారులు తెలిపారు. ఉగ్రవాదులు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారని అధికారులు చెప్పారు.