గూగుల్ సంప్రదాయాన్ని బ్రేక్ చేసిన సుందర్ పిచాయ్
న్యూయార్క్: ఇంటర్నెట్ సేవల దిగ్గజం గూగుల్లో పాత సంప్రదాయాలను పక్కన పెట్టారు దాని సీఈవో సుందర్ పిచాయ్. ప్రతి యేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా గూగుల్ ఇన్వెస్టర్లకు ఆ సంస్థ నుంచి లేఖలు వెళ్లాయి. అయితే ప్రతీ యేడాది లాగే గూగుల్ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్జీ బ్రిన్ ఈ లేఖలు రాయలేదు. పాత సంప్రదాయానికి భిన్నంగా సీఈవో పిచాయ్ ఈ లేఖలు రాశారు.
గూగుల్ వ్యవస్థాపకులు మాత్రమే చేసే ఈ పనిని పిచాయ్ చేయడం సంస్థలో అతని ప్రాధాన్యతను తెలియజేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, పిచాయ్ పనితీరు పట్ల లారీ పేజ్, సెర్జీ బ్రిన్ పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ లేఖలో పిచాయ్ను పరిచయం చేస్తూ లారీ పేజ్ రాసిన ఇంట్రడక్షన్లో ఆయనపై ప్రశంసలు కురిపించారు.
పిచాయ్ పనితీరు అద్భుతంగా ఉందని కొనియాడారు. ఆరు ప్రధాన విభాగాలపై దృష్టి సారించాల్సిన అవసరముందని పిచాయ్ తన లేఖలో పేర్కొన్నారు. గూగుల్ ప్రారంభమైన కొత్తలో సమాచారం అందించే బాధ్యతను మాత్రమే నిర్వర్తించిందని, తర్వాత ప్రాధాన్యాలు మారాయన్నారు.
'టెక్నాలజీ అంటే డివైసెస్ లేదా ప్రొడక్టులను తయారు చేయడమే కాదు. లక్ష్యాలు ఉంటూనే ఉంటాయి. టెక్నాలజీ అనేది ప్రజాస్వామ్యీకరణ శక్తి. సమాచారం ద్వారా ప్రజలను సాధికారత దిశగా నడిపించాలి' అనిని పిచాయ్ పిలుపునిచ్చారు.
ప్రజలు విభిన్న తరహాలో సమాచారం కోరుకుంటున్నారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇందుకోసం ఏఐ, స్మార్ట్ ఫోన్ సంబంధిత టెక్నాలజీలో గూగుల్ భారీగా పెట్టుబడులు పెడుతోందని వెల్లడించారు. భవిష్యత్ గురించి ఆలోచించి ముందడుగు వేయాలన్నారు.