భారత్ అమీర్ఖాన్ ఇల్లు: పాక్ జర్నలిస్ట్ మెహర్ తరార్
లాహోర్: బాలీవుడ్ కథానాయకుడు అమీర్ ఖాన్కు పాకిస్తాన్ జర్నలిస్ట్ మెహర్ తరార్ మద్దతుగా నిలిచింది. అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. దీనిపై మెహర్ తరార్ స్పందించింది.
భారత దేశం అమీర్ ఖాన్ సొంతిల్లు అని ఆమె వ్యాఖ్యానించింది. అమీర్ ఖాన్ను లేదా ఆయన కుటుంబాన్ని అనే హక్కు, మాటల దాడిచేసే హక్కు ఎవరికీ లేదని ఆమె వ్యాఖ్యానించింది. కాగా తన పైన అందరూ ఎదురుదాడికి దిగడంతో అమీర్ ఖాన్ బుధవారం వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే.
భారత్ నా మాతృభూమి, ఈ గడ్డపై జన్మించడం తన అదృష్టమని చెప్పారు. భారత్ విడిచి వెళ్లే ఉద్దేశం తనకు, తన భార్యకు లేదన్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నారు. తన ఇంటర్వ్యూను పూర్తిగా చూడనివారే తనను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు.
తనకున్న దేశభక్తికి ఎవరి కితాబు అవసరం లేదన్నారు. కాగా, అమీర్ ఖాన్.. తన భార్య కిరణ్ రావ్ని ముంబై వదిలి వెళ్లమని అడిగినట్లు కొన్ని వార్తా వెబ్సైట్లలో వార్తలు ప్రచురితమయ్యాయి. అమీర్ దేశంలో అసహనం పెరిగిపోతోందంటూ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బుధవారం కాన్పూర్ కోర్టులో ఆయనపై దేశ ద్రోహం కేసు నమోదయ్యింది.
ముంబైలో ఆయన ఇంటి ముందు హిందూ సేన సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో తన భార్య, కొడుకు కొన్ని రోజుల పాటు ముంబైలో ఉండటం మంచిది కాదని అమీర్ ఖాన్ అభిప్రాయ పడినట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల పాటు వారు ఎక్కడికైనా వెళ్లాలని ఆయన సూచించారని సమాచారం.