ట్రంప్దే గెలుపు: ట్రావెల్ బ్యాన్పై సుప్రీంకోర్టు ఓకే, ఇక పూర్తి స్థాయిలో అమలు..
వాషింగ్టన్: మొత్తానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలిచారు. ఆరు ముస్లిం దేశాలతోపాటు మరో రెండు దేశాలపై ఆయన తీసుకొచ్చిన ట్రావెల్ బ్యాన్ను ఇకపై పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ఆ దేశ సుప్రీంకోర్టు ఓకే చెప్పింది.
దీంతో ఇన్నాళ్లూ పాక్షికంగా అమలు అవుతోన్న ఈ ట్రావెల్ బ్యాన్ ఇకపై పూర్తి స్థాయిలో అమలు కానుంది. ఫలితంగా ఆయా దేశాల పౌరులు అమెరికాలో అడుగు పెట్టడం ఇక కనాతి కష్టమే.
అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకే ట్రంప్ ఆరు ముస్లిం దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. ఇరాన్, లిబియా, సిరియా, యెమన్, సోమాలియా, ఛాద్ దేశాల నుంచి ప్రజలెవరూ అమెరికా రాకుండా వారిపై నిషేధం విధించారు.
అయితే ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొందరు ఫెడరల్ కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసును విచారించిన న్యాయస్థానాలు ట్రావెల్ బ్యాన్పై కొన్ని ఆంక్షలు విధించాయి. ఆ తరువాత ఈ ట్రావెల్ బ్యాన్లో ట్రంప్.. ఉత్తరకొరియా, వెనుజులా దేశాలను కూడా చేర్చారు.
ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల దగ్గరి సంబంధీకులు అంటే అమ్మ, నాన్న, కొడుకు, కుమార్తె తదితర బంధువులకు అమెరికాలో శాశ్వత నివాసం ఉంటే అలాంటి వారికి అనుమతినివ్వాలని కింది కోర్టులు పేర్కొన్నాయి.
దీనిపై ట్రంప్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. ఈ కేసును విచారణలో.. ట్రావెల్ బ్యాన్ అనేది దేశ భద్రకు సంబంధించిన విషయమంటూ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాదించింది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాదనతో సుప్రీం కోర్టు పూర్తిగా ఏకీభవించింది.
చివరికి ట్రంప్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ట్రావెల్ బ్యాన్పై కింది కోర్టులు విధించిన ఆంక్షలను ఎత్తివేసింది. ట్రావెల్ బ్యాన్ను ఇకమీదట పూర్తిస్థాయిలో అమలు చేయాలని పేర్కొంది.
అయితే ఇందులో న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని తదుపరి కార్యాచరణ చేపట్టాలని సూచించింది. దీంతో ప్రస్తుతం అధికారులు నిషేధంపై న్యాయ అంశాలను పరిశీలిస్తున్నారు.