అమెరికా : తుది ఫలితం తేలే వేళ సుప్రీం ట్విస్ట్... ఎన్నికల అధికారులకు కీలక ఆదేశాలు
కౌంటింగ్ ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయన్న విమర్శలు ఓవైపు... ఓటమి భయంతోనే ట్రంప్ ఓట్ల లెక్కింపును వివాదాస్పదం చేస్తున్నారన్న ప్రతివిమర్శలు మరోవైపు... ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు శుక్రవారం(నవంబర్ 6) కీలక ఆదేశాలిచ్చింది. అధ్యక్ష ఎన్నికకు పోలింగ్ జరిగిన నవంబర్ 3 తర్వాత వచ్చిన మెయిల్-ఇన్ బ్యాలెట్ ఓట్లను విడిగా లెక్కించాలని పెన్సిల్వేనియా ఎన్నికల అధికారులను సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే కౌంటింగ్ ప్రక్రియ మాత్రం యధాతథంగా కొనసాగించాలని పేర్కొంది. తుది ఫలితం తేలే వేళ సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు చర్చనీయాంశంగా మారాయి.
బొక్కబోర్లా పడ్డ ట్రంప్... ఎన్నికలనే బద్నాం చేస్తారా..? సొంత పార్టీ నేతలే విబేధిస్తున్న వేళ...
తీర్పు ప్రభావం ఎన్నికలపై ఉండదు..
కౌంటింగ్ ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ ట్రంప్ వర్గం పెన్సిల్వేనియా కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ అలిటో రిపబ్లికన్ల విజ్ఞప్తిని తోసిపుచ్చారు. కౌంటింగ్ ప్రక్రియను యధాతథంగా కొనసాగించాలని... అదే సమయంలో మెయిల్ ఇన్ బ్యాలెట్ ఓట్లను మాత్రం విడిగా లెక్కించాలని చెప్పారు. మెయిల్ ఇన్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ట్రంప్ వర్గం ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యంలో... భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకే ఆ ఓట్లను విడిగా లెక్కించాలని సుప్రీం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇప్పటికైతే ఈ తీర్పు పెన్సిల్వేనియా ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపించబోదు. పెన్సిల్వేనియా అటార్నీ జనరల్ జోష్ షెపిరో కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఎన్నికలకు ముందే ట్రంప్కు ఎదురుదెబ్బ
పెన్సిల్వేనియాలో ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతూనే ఉంది. అధ్యక్ష ఎన్నిక జరిగిన మంగళవారం(నవంబర్ 3) నుంచి శుక్రవారం(నవంబర్ 6) వరకు వచ్చిన మెయిల్ ఇన్ బ్యాలెట్లను ఇక్కడ కౌంట్ చేస్తున్నారు. అయితే ఈ విధానం సరైంది కాదని... కేవలం అధ్యక్ష ఎన్నిక జరిగిన రోజు వచ్చిన మెయిల్ ఇన్ బ్యాలెట్లను మాత్రమే లెక్కించాలని ట్రంప్ వర్గం వాదిస్తోంది. దీనిపై ఎన్నికలకు ముందే సుప్రీం కోర్టును ఆశ్రయించగా... ట్రంప్కు ఎదురుదెబ్బ తగిలింది. న్యాయస్థానం ఆయన పిటిషన్ను కొట్టివేయడంతో కౌంటింగ్ ప్రక్రియను సుప్రీం కోర్టు సమర్థించినట్లయింది.
ట్రంప్ కుట్ర..
కరోనా నేపథ్యం ఈసారి అమెరికా ఎన్నికలను గట్టిగానే ప్రభావితం చేసింది. కరోనాను లెక్క చేయని ట్రంప్.. పోలింగ్ డే రోజు ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మరోవైపు డెమోక్రాట్ అభ్యర్థి జో బైడెన్ మాత్రం మెయిల్ ఇన్ బ్యాలెట్ ఓట్లను గట్టిగా సమర్థించారు. కరోనా నేపథ్యంలో ప్రజలకు మెయిల్ ఇన్ బ్యాలెట్ అవకాశం కల్పించాలని... ఇందుకోసం తగినన్ని నిధులు కేటాయించాలని మొదటినుంచి యూఎస్ కాంగ్రెస్ను కోరుతూ వస్తున్నారు. తద్వారా ఓటర్లకు కరోనా రిస్క్ తక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్కు మద్దతునిచ్చిన చాలామంది తమ ఓట్లను మెయిల్ ఇన్ బ్యాలెట్ ద్వారానే ఉపయోగించుకున్నారు. మెయిల్ ఇన్ బ్యాలెట్ల కౌంటింగ్ కోసం ఒక్కో రాష్ట్రం ఒక్కో డెడ్ లైన్ విధించింది. మరోవైపు ట్రంప్కు మద్దతునిచ్చినవాళ్లలో ఎక్కువమంది పోలింగ్ బూత్లో ఓటేశారు. దీంతో ట్రంప్... అధ్యక్ష ఎన్నిక జరిగిన రోజు పోలైన ఓట్లను మాత్రమే లెక్కించాలని డిమాండ్ చేస్తున్నారు. మెయిల్ ఇన్ బ్యాలెట్ల కౌంటింగ్ నిలిపివేస్తే... బైడెన్కు చెక్ పెట్టడం సులువని భావించి ట్రంప్ ఈ కుట్రకు తెరలేపాడని డెమోక్రాట్లు ఆరోపిస్తున్నారు.
పెన్సిల్వేనియాలోనూ బైడెన్దే పైచేయి..
ఎన్నికల పోలింగ్ రోజున ట్రంప్ లీడ్లో ఉన్నట్లు కనిపించినా... మెయిల్ ఇన్ బ్యాలెట్లలో అత్యధిక ఓట్లు బైడెన్కే పోలవడంతో క్రమంగా ఆయన పుంజుకున్నారు. ట్రంప్ లీడ్లో ఉన్న జార్జియా,పెన్సిల్వేనియా రాష్ట్రాల్లోనూ చివరకు బైడెన్దే పైచేయి అయింది. అధికారికంగా వెల్లడించకపోయినప్పటికీ బైడెన్ అధ్యక్ష ఎన్నిక ఇప్పటికే ఖరారైందని చెప్పాలి. అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం బెైడెన్ 264 ఎలక్టోరల్ ఓట్లతో అధ్యక్ష పీఠానికి మరో ఆరు ఓట్ల దూరంలో ఉన్నారు. అటు ట్రంప్ 214 ఓట్లకే పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.