మోడీపై నమ్మకం ఉంది: పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: మధ్యవర్తిత్వం వహిస్తామంటున్న మీరు.. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఎలా ఎదుర్కొంటారని మీడియా నుంచి ఎదురైన ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర సమాధానం చెప్పారు. భారత్, పాకిస్థాన్ దేశాల ప్రధానులు నరేంద్ర మోడీ, ఇమ్రాన్ ఖాన్లు చర్చల ద్వారా సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.
అంతేగాక, పాకిస్థాన్ నుంచి వస్తున్న ఉగ్రవాదాన్ని తాను ఏమీ ఎదుర్కోనని.. ప్రధాని నరేంద్ర మోడీ ఆ పని సమర్థవంతంగా చూసుకుంటారని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్, పాకిస్థాన్ లు అంగీకరిస్తే తాను మధ్యవర్తిత్వం వహిస్తానని సోమవారం ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ రోజు మాత్రం ఇలా వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్థాన్కు ప్రధాని నరేంద్ర మోడీ గట్టిగానే జవాబిచ్చారని, ఇస్తారని ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆ నమ్మకం తనకు ఉందని అన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే పాకిస్థాన్ చర్చల ద్వారా పరిష్కరించుకుంటే మంచిదని అభిప్రాయపడ్డారు.
మోడీ, ట్రంప్ కీలక సమావేశం
ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం న్యూయార్క్లో సమావేశమయ్యారు. ఐక్యరాజ్యసమితి 74వ సర్వసభ్య సమావేశంలో ట్రంప్ ప్రసంగం అనంతరం ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో వాణిజ్యం, రక్షణ, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం గురించిన చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
ట్రంప్ తనకూ, భారతదేశానికి మంచి మిత్రుడని మోడీ కొనియాడారు. త్వరలోనే భారత్తో వాణిజ్య ఒప్పందం చేసుకుంటామని ట్రంప్ ప్రకటించారు. భారత ప్రగతి కోసం మోడీ అద్భుతంగా పనిచేస్తున్నారని ట్రంప్ ప్రశంసించారు.
కాగా, ఆదివారం హూస్టన్లో జరిగిన హోడీ మోడీ కార్యక్రమం అనంతరం ఇద్దరు దేశాధినేతలు ఐక్యరాజ్యసమితి వేదికగా మరోసారి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హూస్టన్ సభకు వచ్చినందుకు ట్రంప్కు మోడీ ధన్యవాదాలు తెలిపారు.