25 ఏళ్ల తర్వాత.. ఆ విషయంలో వెనుకబడడం మొదలవుతుందట
వాషింగ్టన్ : గ్లోబలైజేషన్.. ఉరుకులు పరుగుల జీవితం.. మనుషుల జీవితాన్ని మరింత యాంత్రికంగా మారుస్తోన్న విషయం తెలిసిందే. ప్రపంచీకరణ పరుగులు పెడుతోన్న ప్రస్తుత నేపథ్యంలో ప్రతీది సాంకేతికతతో ముడిపడి ఉన్నదే. ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక, పలకరింపులైనా.. స్నేహాలైనా అన్నీ అందులోనే జరిగిపోతున్నాయి.
లైకులు, కామెంట్ల మెజర్ మెంట్ తో కొట్టుకుపోతున్న నేటి నెటిజనానికి స్నేహితులంటే, ఫేస్ బుక్ లో ఫ్రెండ్ జాబితానో, వాట్సాప్ ఛాట్ జాబితానో అన్న చందంగా మారిపోయింది. సరిగ్గా ఇదే పాయింట్ పై ఫోకస్ చేసిన ఓ సర్వే సంస్థ అసలు సోషల్ మీడియాతో సంబంధం లేకుండా ఎంతమంది వ్యక్తులు తమ స్నేహితులకు టచ్ లో ఉంటున్నారనే విషయాలపై ఆరా తీసింది.
సర్వేలో భాగంగా ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. సర్వే ప్రకారం, 25 ఏళ్ల వరకు వ్యక్తులంతా తమ స్నేహితుల సంఖ్య పెంచుకుంటూ వస్తారని, తర్వాత ఆ సంఖ్య క్రమ క్రమంగా తగ్గతూ జీవితపు చరమాంకం వరకు అతికొద్ది మంది స్నేహితులు మాత్రమే మిగులుతారని సర్వే పేర్కొంది.
ఓ 25 ఏళ్ల సగటు యువకులు నెలకు 19 మంది మిత్రులతో సెల్ ఫోన్ ద్వారా టచ్ లో ఉంటున్నారని, యువతులైతే 17 మందితో టచ్ లో ఉంటున్నారని తెలిపింది. అదే 39 ఏళ్ల వయస్సు పురుషులు ప్రతీ నెలా వరుసగా 12 మందితోనూ మహిళలు 15 మందితోనూ ఫోన్ లో మాట్లాడతున్నట్టు సర్వేలో తేలింది.
ఇలా స్నేహితుల జాబితా క్రమంగా తగ్గిపోయి 80 ఏళ్ల వయస్సులో చివరికి స్త్రీ, పురుషులిద్దరూ నెలకు సగటున ఆరుగురితో మాత్రమే ఫోన్ ద్వారా టచ్ లో ఉంటున్నట్టు సర్వే తెలిపింది. ఇక సోషల్ మీడియాలో తాత్కాలిక స్నేహాలపై మోజు పెంచుకుని నిజ జీవితంలో చాలామంది మంచి స్నేహితులను కోల్పోతున్నారని పరిశోధకులు అంటున్నారు. వ్యాపార, ఉద్యోగ రంగాల్లో తీరిక లేకుండా ఉండడం కొందరిని స్నేహితులకు దూరం చేస్తే, కుటుంబ పరిస్థితుల వల్ల మరికొందరు స్నేహితుల నుంచి దూరం కావాల్సి వస్తుందని సర్వేలో పేర్కొన్నారు.