పాక్ ఉగ్రవాదం: మద్దతిస్తామంటూ భారత్కు అమెరికా ఫోన్
వాషింగ్టన్: భారత ఉగ్రపోరుకు అమెరికా మద్దతు పలికింది. యూరీ ఘటన అనంతరం తొలిసారి ఆ దేశ నుంచి స్పష్టమైన సందేశాలు అందాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్థాన్ పోరాడాలని.. ఆ దేశం నుంచి తాము అదే ఆశిస్తున్నామని అమెరికా భద్రతా సలహాదారు సూసన్ రైస్ అన్నారు.
ఈ మేరకు ఇటీవల జమ్మూకాశ్మీర్లో జరిగిన యూరీ ఉగ్రదాడి ఘటనపై భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో ఫోన్లో మాట్లాడిన రైస్.. పాకిస్థాన్ గురించి ప్రస్తావించినట్లు అమెరికా సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ తెలిపారు.
యూరీ దాడి అనంతరం తొలిసారిగా దోవల్తో మాట్లాడిన సూసన్.. ఘటనను తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదులుగా గుర్తించిన లష్కరే తోయిబా, జైషే మహ్మద్ లాంటి సంస్థలకు వ్యతిరేకంగా పాకిస్థాన్ పోరాడాలని, వాటిపై కఠినచర్యలు తీసకోవాలని తాము ఆశిస్తున్నట్లు సూసన్ అన్నారు.
పాకిస్థాన్లోని ఉగ్రవాద బృందాలు భారతీయులపై దాడి చేస్తున్న విషయాన్ని ప్రస్తావించి.. యూరీ ఉగ్రవాద దాడి విషయంలో తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పాకిస్థాన్ను కూడా కోరినట్లు చెప్పారు.
కాగా, యూరీ దాడి అనంతరం అమెరికాకు చెందిన ఒక అత్యున్నత అధికారి భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్కు ఫోన్ చేయడం ఇదే తొలిసారి. ఉగ్రవాద బాధిత దేశాలకు న్యాయం చేసేందుకు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామనే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సందేశాన్ని ఆమె దోవల్కు వివరించారు.
యూరీ దాడిలో పాక్ ఉగ్రవాదులు 18మంది భారత సైనికుల ప్రాణాలు బలితీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం భారత సైన్యం కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.