ఈ చేప ధర ఇన్ని కోట్ల రూపాయలా... ఏంటో దీని స్పెషాలిటీ..?
జపాన్ : చాలామంది మాంసాహార ప్రియులకు చేపలంటే భలే ఇష్టం. ఒక మంచి కొరమీను దొరికితే చాలు ఆరోజు వారి కడుపు నిండినట్లే. చేపలు ఆరోగ్యపరంగా కూడా చాలా లాభాలు చేకూరుస్తాయి. అందుకే కొరమీను, అపోలో, పులసలు ఇలాంటి చేపలకు మాంసాహార ప్రియులు ఎంత ధరైనా సరే పెట్టి కొంటారు. దాని రుచిని ఆస్వాదిస్తారు. కానీ జపాన్లో ఓ వ్యక్తి ట్యూనా చేపకోసం పెట్టని ఖర్చును ఎవరూ భరించలేరేమో..
బాబోయ్ ఇదేం ధర..రూ.21 కోట్లా..?
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది గాంచిన ట్యూనా చేప ఒకదాన్ని జపాన్ రాజధాని టోక్యోలో వేళానికి పెట్టారు. ఇక చేపలంటే అమితంగా ఇష్టపడేవారు ఆ వేళానికి వచ్చారు. వేళం పాట మొదలైంది. ఒక్కొక్కరూ తమకు తోచినంతగా వేళంపాట పాడుతున్నారు. నిర్వాహకులు పెట్టిన బేస్ ప్రైస్ నుంచి వేళం ప్రారంభమైంది. ట్యూనా చేప ధర బాగానే పలుకుతుంది. ప్రతి రౌండులో దాని ధర ఎగబాకుతూ పోయింది. ఒకానొక సమయంలో వేళంపాటకు బ్రేక్ పడింది. జపాన్లో సుషి పేరుతో పలు రెస్టారెంట్లు నిర్వహిస్తున్న యజమాని కియోషి కిమోరా ఈ ట్యూనా ఫిష్ను వేలంపాటలో రూ.21.5 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశాడు. ఈ చేపను టోక్యోలోని న్యూ ఫిష్ మార్కెట్లో వేలం వేశారు.
ఇంతలా ఎప్పుడూ భయపడలేదు!: తెరవగానే పాములు వచ్చాయి (వీడియో)
2013లో రూ.9 కోట్లు పెట్టి ట్యూనా చేపను కొన్న కిమోరా
ట్యూనా చేపలు కొనాలంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు కియోషి కిమోరా. దానికోసం ఇంకా ఎక్కువైనా వెచ్చించేందుకు తాను సిద్ధమని వెల్లడించాడు. 2013లో కూడా ఇలాంటి ట్యూనా చేపను 1.4 మిలియన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో రూ.9,75,59,700కు కొన్నట్లు చెప్పారు. అయితే ఈ సారి బ్లూఫిన్ ట్యూనా చేపకు దాదాపు రెండు రెట్లు ఎక్కవగా వెచ్చించినట్లు చెప్పాడు ఆ హోటల్ యజమాని కిమోరా. 278 కేజీల బరువు ఉండే ఈ అరుదైన బ్లూఫిన్ చేపను జపాన్ ఉత్తర తీరంలో పట్టుకున్నట్లు చెప్పారు. ఇప్పుడు కొన్న ట్యూనా చేప క్వాలిటీలో నెంబర్ వన్ అని చెప్పాడు.
ట్యూనా చేపలు అంతరించిపోతున్నాయని ఆందోళన
సాధారణంగా ట్యూనా చేప పౌండుకు 40 డాలర్లకు అమ్ముడుపోతుంది. అయితే కొత్త సంవత్సరం కాబట్టి దాని ధర పౌండుకు 200 మిలియన్ డాలర్ల వరకు చేరుకుంది. బ్లూఫిన్ ట్యూనా ఫిష్ను జపనీయులు ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే ఒక్క ట్యూనా చేపను పట్టుకోగలిగితే జీవితం సెటిల్ అయిపోతుందన్న ఉద్దేశంతో చాలామంది సముద్రంలో ట్యూనా చేపకోసం వేటాడుతుంటారు. అయితే ట్యూనా చేపలు అంతరించి పోతున్న చేపల జాబితాలో చేరిపోతాయనే ఆందోళన జంతుప్రేమికులు వ్యక్తం చేస్తున్నారు.