పాక్కు సుష్మా షాక్: సార్క్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన విదేశాంగా మంత్రి
న్యూయార్క్: పాకిస్తాన్కు భారత్ గట్టి షాక్ ఇచ్చింది. సార్క్ సమావేశాల్లో భాగంగా సమావేశానికి హాజరైన సార్క్ దేశాల విదేశాంగ మంత్రుల మీటింగ్ నుంచి భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మధ్యలోనే వెళ్లిపోయారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమ్మూద్ ఖురేషీ అక్కడికి రాగానే సుష్మా లేచి వెళ్లిపోయారు. 73వ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జరుగుతున్న సార్క్ అనధికార సమావేశానికి సుష్మా హాజరయ్యారు.దీనికి అధ్యక్షత వహించారు నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ కుమార్ గ్యావాలి.
సుష్మా తను చేయాల్సిన ప్రకటన చేసి సమావేశం పూర్తిగా ముగియకుండానే మధ్యలో వెళ్లిపోయారు. అయితే సుష్మాతో తానేమీ మాట్లాడలేదని పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ అన్నారు. అయితే తను ఆరోగ్య సమస్యలతో మధ్యలోనే వెళ్లిపోయి ఉండిచ్చనే అనుమానం ఖురేషీ వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఒక దేశానికి చెందిన మంత్రులు తాము చెప్పాల్సినదంతా చెప్పిన తర్వాత సమావేశం నుంచి వెళ్లిపోవడం సాధారణమే అని భారత దౌత్యాధికారులు తెలిపారు. అయితే ఇలా సమావేశం మధ్యలోనే వెళ్లినవారిలో సుష్మా స్వరాజ్ మొదటి వ్యక్తి కారని అంతకుముందు అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రలు కూడా సమావేశం పూర్తిగా ముగియకముందే వెళ్లిపోయారని వారు గుర్తు చేశారు. సుష్మా స్వరాజ్ ఇతర మీటింగ్లు హాజరుకావాల్సి ఉందని అయితే విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే సమావేశం ముగిసే వరకు అక్కడే ఉన్నారని చెప్పారు. షెడ్యూల్ ప్రకారం సుష్మా , ఖురేషీల భేటీ కావాల్సి ఉండగా పాక్ పాల్పడిన దుశ్చర్యతో ఆ సమావేశంలో పాల్గొనరాదని భారత్ డిసైడ్ అయ్యింది.
ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడాలంటే చర్చల ద్వారానే సాధ్యమవుతందని ఇలా ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తే అడుగు ముందుకు పడదని ఖురేషీ అన్నారు. ఒక దేశం వ్యవహరిస్తున్న తీరుతోనే సార్క్ దేశాలు అనుకున్న లక్ష్యం దిశగా అడుగులు వేయలేకపోతున్నాయని భారత్ను ఉద్దేశిస్తూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు ఖురేషీ. సుష్మా స్వరాజ్ దేశాల మధ్య పరస్పర సహకారం గురించి మాట్లాడారని అయితే ఒక దేశం చర్చలకు విముఖత చూపుతున్నప్పుడు పరస్పర సహకారం అనేది ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు ఖురేషీ. దేశాల మధ్య వాణిజ్య బంధాల గురించి మాట్లాడుతున్నారని చెప్పిన ఖురేషీ రెండు దేశాల మధ్య సరైన చర్చలు లేకుండా వాణిజ్యం ఎలా జరుగుతుందన్నారు.
ఇక సార్క్ సమావేశంలో మాట్లాడిన సుష్మా స్వరాజ్ పలు అంశాలను తన ప్రసంగంలో ప్రస్తావించారు. తమ ప్రభుత్వం తీసుకున్న "పొరుగుదేశాలు ముందు"అనే విధానం మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పారు. పరస్పర సహకారంతోనే రెండు దేశాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని సుష్మా అన్నారు.