ఐఎస్ఐఎస్ ను అంతం చేద్దాం రండి: సుష్మాస్వరాజ్
జకర్తా: ప్రపంచ దేశాలకు సవాలు చేస్తు నాగరికతనే నాశనం చేస్తున్న ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల(ఐఎస్ఐఎస్)ను అంతం చెయ్యడానికి అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ మనవి చేశారు.
బుధవారం ఆమె ఇండోనేషియా రాజధాని జకర్తాలో జరుగుతున్న ఆసియా- ఆఫ్రికా దేశాల సదస్సు-2015లో ప్రసగించారు. ఐఎస్ఐఎస్ మహమ్మారిగా తయారైయ్యిందని దానిని శాశ్వతంగా నామరూపాలు లేకుండ చెయ్యాల్సిన అవసరం వచ్చిందని అన్నారు.
అందుకు ఆసియా, ఆఫ్రికా దేశాలు ఐక్యంగా పోరాడాలని పిలునిచ్చారు. మనం కఠినంగా వ్యవహరిస్తేనే ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు వారి కార్యకలాపాలకు స్వస్తి చెబుతారని, లేదంటే ఇదే విధంగా వ్యవహరిస్తారని అన్నారు. మహిళలు, చిన్న పిల్లల పట్ల వారు దారుణంగా వ్యవహరిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో మహిళలు, పిల్లలు, అమాయకుల పట్ల వారు గతంలో వ్యవహరించిన తీరుని సభలో ప్రస్తావించారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కాలికి గాయం కావడంతో ఆమె కూర్చుని ప్రసంగించారు.