కెనడా భారతీయ రెస్టారెంట్ వద్ద పేలుడు: స్పందించిన సుష్మా, హెల్ప్లైన్ ట్వీట్
న్యూఢిల్లీ: కెనడాలో భారతీయ రెస్టారెంట్లో పేలుడు జరిగిన ఘటనపై కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ శుక్రవారం స్పందించారు. ఈ విషయాన్ని ఆమె ధ్రువీకరించారు. ట్విటర్ ద్వారా హెల్ప్లైన్ నంబర్ను ట్వీట్ చేశారు.
కెనడాలోని ఒంటారియో మిస్సిస్వాగాలోని భారతీయ రెస్టారెంట్ బాంబే భెల్లో ఈ పేలుడు సంభవించిందని, టొరంటో కాన్సుల్ జనరల్, కెనడాలోని ఇండియన్ కమిషనర్తో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ అక్కడి విషయాలను తెలుసుకుంటున్నానని, అత్యవసర సమాచారం కోసం 1-647-668-4108 సంప్రదించండంటూ సుష్మా ట్వీట్ చేశారు.
కాగా, బాంబే భెల్ అనే భారతీయ రెస్టారెంటులోకి ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు తమ వెంట తెచ్చిన పేలుడు పదార్థాలను పేల్చేసినట్లు అక్కడ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. బాంబే భెల్ రెస్టారెంట్లోకి వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి చేతిలో కవరు ఉందని, వాళ్లు వాటిని పేల్చేసిన తర్వాత అక్కడి నుంచి పరారైనట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు.
సీసీటీవీలో రికార్డయిన వారి ఫొటోలను పోలీసులు ట్విటర్ ద్వారా విడుదల చేశారు. పేలుడు సంభవించిన ప్రాంతం వద్ద భారీగా భద్రతా సిబ్బంది మోహరించారు. ముందస్తు జాగ్రత్తగా ఆ ప్రదేశాన్నంతా ఖాళీ చేయించి తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
గురువారం రాత్రి 10.30గంటల ప్రాంతంలో బాంబే భెల్ రెస్టారెంట్లో ఈ పేలుడు చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. పేలుడు జరిగిన సమయంలో రెస్టారెంట్లో ఎంతమంది ఉన్నారనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు.