ప్రపంచం దృష్టిని ఆకర్షించిన స్వీడన్లోని ఓ ఆసుపత్రి
న్యూఢిల్లీ: స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లోని ఓ ఆసుపత్రి రాత్రికి రాత్రే వార్తల్లోకి ఎక్కింది. అత్యాచార పురుష బాధితుల కోసం ఓ ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినట్టు ప్రకటించి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అత్యాచార మహిళా బాధితుల కోసం ఇప్పటికే ఈ ఆసుపత్రిలో సేవలందిస్తున్నారు.
తాజాగా మగ అత్యాచార బాధితులకు వైద్యం అదించేందుకు ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు సోడర్స్ జఖుసెట్ ఆస్పత్రి ప్రకటించింది. వైద్యంతో పాటు న్యాయసేవలు, కౌన్సెలింగ్ కూడా అందిస్తామని తెలిపింది. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించామని ఒక ప్రకటనలో పేర్కొంది.
లింగవివక్ష లేకుండా వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ఈ ప్రత్యేక వార్డుని ఏర్పాటు చేసినట్టు లిబరల్ పార్టీ అధికార ప్రతినిధి రస్మస్ జొనలండ్ తెలిపారు. మగ అత్యాచార బాధితుల కోసం ప్రత్యేకంగా ఓ వార్డుని ఏర్పాటు చేయడం స్వీడన్లో ఇదే ప్రథమమని, బహుశా ప్రపంచంలోనే మొదటిదని రస్మస్ తెలిపారు.
లైంగిక వేధింపులకు గురైన పురుషులు వైద్యం కోసం ఎక్కడికి వెళ్లాలో తెలియక సతమతమవుతున్నారని స్వీడిష్ నేషనల్ కౌన్సిల్ ఫర్ క్రైమ్ ప్రివెన్షన్ నిర్వహించిన సర్వేలో వెల్లడింది.గతేడాది స్వీడన్లో 370 మంది పురుషులు లైంగిక వేధింపులకు గురైనట్టు కేసులు నమోదయ్యాయి.
స్వీడన్లో పైకి చెప్పుకొని పురుష అత్యాచార బాధితులు ఇంకా ఎంతో మంది ఉన్నారని, వీరిని కూడా కలుపుకుంటే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. ఇది ఇలా ఉంటే అత్యాచార పురుష బాధితుల కోసం ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు ప్రారంభించారన్న వార్త తెలియడంతో సోషల్ మీడియాలో పెను సంచలనమైంది.
ఈ వార్తకు మొదటి గంటలోపే నాలుగు వేల కామెంట్లు వచ్చాయి. అసలు పురుషులు అత్యాచారానికి గురవుతారా అంటూ కొందరు సందేహం వ్యక్తం చేశారు. అత్యాచారానికి గురైన మగాళ్ల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినందుకు మరికొందరు ధన్యవాదాలు తెలిపారు.