ఇతర దేశాల నుంచి చెత్త దిగుమతి చేసుకుంటున్న స్వీడన్: ఎందుకంటే..?
స్టాక్హోం: తమ దేశంలో పెరిగిపోతున్న చెత్తతో ప్రపంచంలోని చాలా దేశాలు ఆందోళన చెందుతున్నాయి. మనదేశంలోనైతే ఇది మరింత ఎక్కువగా ఉంది. అయితే, స్వీడన్ దేశం మాత్రం ప్రపంచ దేశాలకు భిన్నంగా నడుచుకుంటోంది. తమ దేశంలో ఉన్న చెత్త చాలదన్నట్లు ఇతర దేశాల్లోని చెత్తను కూడా దిగుమతి చేసుకుంటోంది. ఇప్పుడిది ప్రపంచంలో హాట్ టాపిక్గా మారింది.
అయితే దిగుమతి చేసుకున్న చెత్తను రీసైక్లింగ్ చేసి విద్యుత్తును తయారు చేస్తోంది స్వీడన్. ఇందుకోసమే ఇతర దేశాల నుంచి చెత్తను దిగుమతి చేసుకుంటోంది. కాగా, ఆ దేశానికి కావల్సిన విద్యుత్ అవసరాల్లో సగానికి పైగా కేవలం ఈ రీసైకిల్డ్ చెత్త నుంచే తీరడం విశేషం. నిజానికి అక్కడ శిలాజ ఇంధనాలపై 1991 నుంచే భారీగా పన్నులు ఉన్నాయి. ఇక్కడి రీసైక్లింగ్ ప్లాంట్లు ఎంత సమర్థంగా పనిచేస్తాయంటే.. దేశంలో గత సంవత్సరం ఇళ్ల నుంచి వచ్చిన మొత్తం చెత్తలో కేవలం 1 శాతాన్ని మాత్రమే డంపింగ్ యార్డులకు తరలించారట.
అంతేగాక, స్వీడన్లో జాతీయ రీసైక్లింగ్ పాలసీ కూడా ఉంది. దాని వల్ల ప్రైవేటు కంపెనీలు కూడా చెత్తను దిగుమతి చేసుకుని దాన్నుంచి విద్యుత్ తయారుచేస్తున్నాయి. దీంతోపాటు, చెత్తను మండించడం ద్వారా పుట్టే వేడిని.. ఒక నెట్వర్క్ ద్వారా ఇళ్లకు కూడా సరఫరా చేస్తారు. అక్కడ శీతాకాలంలో ఉష్ణోగ్రతలు చాలా పడిపోతాయి కాబట్టి ప్రత్యేకంగా ఎవరికి వారు రూం హీటర్లు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ నెట్వర్క్ నుంచి వచ్చే వేడి సరిపోతుంది. కరెంటు, కేబుల్ లాగే వేడిని కూడా పైపుల ద్వారా అందిస్తున్నారిక్కడ.
ఇలా అన్ని రకాలుగా చెత్తను ఉపయోగించుకోవడంతో.. దేశంలో ఇళ్ల నుంచి వస్తున్న చెత్త ఏమాత్రం సరిపోవడం లేదట. దీంతో స్వీడన్ వాళ్లు బయటి దేశాలనుంచి కూడా దిగుమతి చేసుకుంటామని ఆఫర్లు చేస్తున్నారు. యూరోపియన్ దేశాల్లో డంపింగ్ యార్డులలో చెత్తను పారేయడం మీద నిషేధం ఉంది. అందువల్ల భారీ జరిమానాలు కట్టడం కంటే.. ఎవరికి వాళ్లు రీసైక్లింగ్ ప్లాంట్లు పెట్టుకుని దాంతో విద్యుత్ ఉత్పత్తి చేయడం మొదలుపెట్టారు.
ప్రతిదేశంలోనూ ఇలాగే చేస్తే కాలుష్యం తగ్గడంతో పాటు బొగ్గు అవసరం కూడా తగ్గి కర్బన ఉద్గారాలు అదుపులోకి వస్తాయని నిపుణులు అంటున్నారు. మన దేశంలో చెత్త ఎక్కడపడితే అక్కడ ఉండటంతో 'స్వచ్ఛభారత్' లాంటి నినాదాలు ఇస్తున్నా ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుండగా.. అక్కడ మాత్రం బ్రహ్మాండమైన ఫలితాలు వస్తున్నాయి. అదే తరహా విధానాలను మనదేశం కూడా అమలుచేస్తే స్వచ్ఛ భారత్ అమలుతోపాటు ఇంటి అవసరాలను తీర్చుకునే అవకాశం కూడా ఉంటుంది.