ముగిసిన ఆపరేషన్, మోనిస్ హతం: ఆంధ్ర టెక్కీ క్షేమం, ఇద్దరు మృతి
సిడ్నీ: ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో గల లిండ్ కేఫ్లో ఉగ్రవాది నుంచి బందీలను విడిపించేందుకు కమెండోలో చేపట్టిన ఆపరేషన్ ముగిసింది. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా టెక్కీ విశ్వకాంత్ అంకిరెడ్డి సహా బందీలను కమెండోలు విడిపించారు. కొంత మంది బందీలు పారిపోయినట్లు సమాచారం. కేఫ్లో ఉన్నవారిలో ఇద్దరు మరణించినట్లు తెలుస్తోంది.
దాదాపు 16 గంటల పాటు ఆపరేషన్ కొనసాగింది. బందీలను విడిపించే క్రమంలో జరిపిన కాల్పుల్లో ముగ్గురు గాయపడినట్లు తెలుస్తోంది. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సిడ్నీ కేఫ్ ఆపరేషన్లో బాంబు డిస్పోజల్ రోబోట్ను ఉపయోగించారు. బందీలు ఉగ్రవాది నుంచి పారిపోతున్న దృశ్యాలను ఆస్ట్రేలియా టీవీలు ప్రసారం చేశాయి. కేఫ్ను తన ఆధీనంలోకి తీసుకుని పలువురిని నిర్బంధించిన సాయుధుడు కమెండోల కాల్పుల్లో మరణించినట్లు ఆస్ట్రేలియా మీడియా చెబుతోంది.
హరోన్ మోనిస్
కేఫ్ను తన ఆధీనంలోకి తీసుకుని, కొంత మందిని నిర్బంధించిన దుండగుడిని హరూన్ మోనిస్గా నిఘా వర్గాలు గుర్తించినట్లు ఆస్ట్రేలియా మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఏడేళ్ల క్రితం మోనిస్ ఆస్ట్రేలియా కుటుంబ సభ్యులను దూషిస్తూ లేఖలు రాశాడు. తనను తాను ఆధ్యాత్మిక గురువుగా ప్రకటించుకున్న మోనిస్పై ఇటీవలి కాలంలో 50కి పైగా ఆరోపణలు వచ్చినట్లు ఆస్ట్రేలియా నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఇరాన్ జాతీయుడైన మోనిస్ కొన్నేళ్ల క్రితం సిడ్నీలోని బెక్స్లీ ఉత్తర భాగంలో నివసించినట్లు తెలుస్తోంది.
అఫ్గనిస్తాన్లో ఆస్ట్రేలియా బలగాల మోహరింపును మోనిస్ వ్యతిరేకిస్తున్నాడు. ఏడుగురు మహిళపై లైంగిక దాడికి పాల్పడినందుకు అతన్ని దోషిగా కూడా తేల్చారు. అతనిపై పలు కేసులు పెండింగులో ఉన్నాయి. అతను ఇరాన్లో మంతెఘి బౌర్జెర్దీలో జన్మించాడు. 1996లో ఆస్ట్రేలియాకు వచ్చాడు.
తండ్రితో మాట్లాడిన ఆంధ్ర టెక్కీ
సిడ్నీ కేఫ్ నుంచి క్షేమంగా బయటపడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాకు చెందిన టెక్కీ తండ్రి ఈశ్వర రెడ్డితో మాట్లాడారు. తాను క్షేమంగా బయటపడినట్లు సమాచారం ఇచ్చారు. దీంతో ఈశ్వర రెడ్డి కుటుంబ సభ్యులు ఆనందంగా ఊపిరి పీల్చుకున్నారు. మోనిస్ను కమెండోలు కాల్చి చంపినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇద్దరు భారత జాతీయులు క్షేమం
సిడ్నీ కేఫ్లో సాయుధుడి నిర్బంధానికి గురైన ఇద్దరు భారతీయ జాతీయులు కూడా క్షేమంగా బయటపడ్డారు. విశ్వకాంత్ అంకిరెడ్డితో పాటు పుష్పేందు ఘోష్ కూడా క్షేమంగా బయటపడినట్లు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పారు.