భయం గుప్పిట్లో సిడ్నీ: ఉగ్రవాది మోనిస్? ఆంధ్ర టెక్కీ తండ్రి ధీమా
సిడ్నీ: సిడ్నీ కేఫ్ సోమవారం రాత్రి వరకు కూడా సాయుధ ఆగంతకుడి ఆధీనంలోనే ఉంది. ఆస్ట్రేలియా పోలీసులు సిడ్నీని దిగ్బంధం చేశారు. ఇస్లామిక్ జెండాను ప్రదర్శించాలని కేఫ్ను తన ఆధీనంలోకి తీసుకున్న ఆగంతకుడు షరతు పెట్టినట్లు చెబుతున్నారు. అదే విధంగా ఆస్ట్రేలియా ప్రధానితో మాట్లాడించాలని కూడా డిమాండ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. జిహాదీల దాడిగానే దాన్ని అనుమానిస్తున్నారు. దీంతో ఆస్ట్రేలియాలోని అతి పెద్ద నగరం సిడ్నీ భయం గుప్పిట్లో చిక్కుకుంది. అయితే, ఈ విషయంలో కొత్త విషయం ప్రచారంలోకి వచ్చింది. హరూన్ మోనిస్ అనే అతను సిడ్నీ కేఫ్లో కొంత మందిని బందీలుగా పట్టుకున్నట్లు చెబుతున్నారు.
ఒకడు కాకుండా ఇద్దరు సాయుధులు కేఫ్ను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. పార్లమెంటరీ ఆఫీసర్లతో పాటు పోలీసులు కేఫ్ చుట్టూ ఉన్న పలు బ్లాకులను చుట్టుముట్టారు. కేఫ్ చుట్టూ స్వాత్ పోజిషన్ తీసుకుని ఉంది. కేఫ్పై హెలికాప్టర్లు చక్కర్లు కొడుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి ఆగంతకుల చేతి నుంచి ఐదుగురు బందీలు బయటకు వచ్చారు. వారు బందీల నుంచి తప్పించుకుని వచ్చినట్లు చెబుతున్నారు. అయితే, వారిని కావాలనే దుండగులు వదిలేశారనే వాదన కూడా ఉంది.
కేఫ్లో దుండగుల బందీలుగా ఇప్పటికీ 15 మంది ఉన్నట్లు భావిస్తున్నారు. బందీ వ్యవహారం రాజకీయ ప్రేరేపిత మలుపు తీసుకుంటోందని ప్రధాని టోనీ అబోట్ అన్నారు. ఇది ఆందోళనకరమైన సంఘటన అని, సమస్యను తాను అర్థం చేసుకోగలనని ఆయన అన్నారు.
సాయుధుడితో సంప్రదింపులు జరుగతున్నట్లు సమాచారం. కేఫ్ను తన ఆధీనంలోకి తీసుకున్న సాయుధుడి వయస్సు 40, 50 ఏళ్ల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. తమ సిబ్బంది భవనం లోపల చిక్కుకున్నారని ఆస్ట్రేలియా రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. యుఎస్ కాన్సులేట్ను, సిడ్నీ ఒపెరా హౌస్ను ఖాళీ చేశారు.
తమ కుమారుడు సురక్షితంగా బయటపడగలడనే విశ్వాసాన్ని సాయుధుల చేతిలో బందీగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాకు చెందిన ఇన్ఫోసిస్ టెక్కీ తండ్రి ఈశ్వర్ రెడ్డి వ్యక్తం చేశారు. తమ కుమారుడు బందీగా ఉన్న విషయాన్ని ఇన్ఫోసిస్ తమకు సోమవారం ఉదయమే తెలియజేసిందని ఆయన కొన్ని పత్రికలతో చెప్పారు.
సాయుధులు అరిబిక్ భాషలో మాట్లాడుతున్నట్లు తెలిసిందని ఈశ్వరరెడ్డి చెప్పారు. బందీలుగా 35 మంది ఉన్నట్లు చెబుతున్నారని ఆయన అన్నారు. ఇద్దరు ఉగ్రవాదులు లోన ఉన్నట్లు సమాచారమని ఆయన అన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తమతో మాట్లాడుతున్నట్లు ఆయన తెలిపారు. గుంటూరు జిల్లాకు చెందిన ఇన్ఫోసిస్ టెక్కీ విశ్వకాంత్ అంకిరెడ్డి కూడా సిడ్నీ కేఫ్ బందీల్లో ఉన్న విషయం తెలిసిందే.
హరూన్ మోనిస్?
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో లిండ్ కేఫ్లో కొందర్ని బందీలుగా పట్టుకున్న ఉగ్రవాదితో పోలీసులు చర్చలు జరుపుతున్నారు. దుండగుడిని హరూన్ మోనిస్గా నిఘా వర్గాలు గుర్తించినట్లు ఆస్ట్రేలియా మీడియా వర్గాలు చెబుతున్నాయి. బందీలను పట్టుకుని 15 గంటలు కావస్తున్నా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉన్నది.
బందీలకు ముప్పు వాటిల్లకూడదనే ఉద్దేశంతో భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టడం లేదు. ఏడేళ్ల క్రితం మోనిస్ ఆస్ట్రేలియా కుటుంబ సభ్యులను దూషిస్తూ లేఖలు రాశాడు. తనను తాను ఆధ్యాత్మిక గురువుగా ప్రకటించుకున్న మోనిస్పై ఇటీవలి కాలంలో 50కి పైగా ఆరోపణలు వచ్చినట్లు ఆస్ట్రేలియా నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఇరాన్ జాతీయుడైన మోనిస్ కొన్నేళ్ల క్రితం సిడ్నీలోని బెక్స్లీ ఉత్తర భాగంలో నివసించినట్లు తెలుస్తోంది.