మూడో ప్రపంచ యుద్ధంపై రష్యా వార్నింగ్!: కంపించిన డమాస్కస్, అమెరికా రాకెట్లని పేల్చేశారు
మాస్కో: మూడో ప్రపంచ యుద్ధం వస్తోందని, సిద్ధంగా ఉండాలని బాంబ్ షెల్టర్లో తలదాచుకునే సమయంలో శరీరాన్ని ధార్మికత నుంచి కాపాడుకునేందుకు అయోడిన్ను కూడా దగ్గర పెట్టుకోవాలని, అవసరమైతే ఇతర మందులు, నిత్యావసర వస్తువులను సిద్ధంగా ఉంచుకోవాలని రష్యా ప్రజలకు ప్రభుత్వ టీవీ ఛానల్ సూచించింది.
చదవండి: అన్నంత పనిచేశాడు: సిరియాపై ఎటాక్.. రష్యా ఇరాన్లకు ట్రంప్ వార్నింగ్
సిరియాపై అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులు వైమానిక దాడులకు పాల్పడిన నేపథ్యంలో రోసియా - 24 ఛానల్ ఈ మేరకు ఓ కథనాన్ని ప్రసారం చేసింది. అమెరికా క్షిపణుల దాడుల అనంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో సైనిక విశ్లేషకులు అలెగ్జాండర్ గోల్ట్స్ ఈ హెచ్చరికలు జారీ చేశారు. యుద్ధ సమయంలో ఆహార సరఫరాలో చాలా వస్తువులు ఉంటాయని, కానీ తీపి పదార్థాలు తక్కువగా, నీరు ఎక్కువగా ఉంచుకోవాలన్నారు.
చదవండి: సిరియా ఇష్యూ, మా మిసైళ్లు వస్తున్నాయి, సిద్ధంగా ఉండండి: రష్యాకు ట్రంప్ హెచ్చరిక
మధ్యదరా సముద్రంలో మోహరించి దాడులు
బ్రిటన్, ఫ్రాన్స్లతో కలిసి అమెరికా సిరియాపై క్షిపణి దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. సిరియాలోని డౌమా పట్టణంలో ఇటీవల జరిగిన రసాయన దాడులతో వందలాది మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. ఈ దాడులను అమెరికా సహా ప్రపంచ దేశాలు ఖండించాయి. సొంత ప్రజల పైనే రసాయన దాడులకు పాల్పడిన నేపథ్యంలో సిరియా అధ్యక్షులు బషర్ అల్ అసద్పై అమెరికా అధ్యక్షులు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసద్ మూల్యం చెల్లించుకుంటారని చెప్పారు. ఈ నేపథ్యంలో సిరియాపై క్షిపణుల దాడి చేశారు. మూడు దేశాలు మధ్యదరా సముద్రంలో మోహరించిన నౌకలపై మానవసహిత విమానాల ద్వారా, ఇతర వైమానిక స్థావరాల నుంచి దాడులు చేశాయి.
రష్యా విఫలం
రసాయన దాడులను ప్రస్తావి ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఒక మనిషి చేసిన పని కాదని, ఒక రక్కసి పాల్పడ్డ ఘోర నేరాలు అని, రసాయన ఆయుధాల వినియోగాన్ని నిలిపేసే వరకూ సిరియాపై సైనిక, ఆర్థిక, దౌత్య ఒత్తిడి కొనసాగుతుందని స్పష్టంచేశారు. అసద్ ప్రభుత్వానికి బాసటగా నిలుస్తున్నారంటూ ఇరాన్, రష్యాలపై మండిపడ్డారు. కాగా, సిరియాలో రసాయన ఆయుధాలు లేకుండా చేస్తామని 2013లో రష్యా అధ్యక్షులు పుతిన్ హామీ ఇచ్చారని, ఈ విషయంలో ఘోరంగా విఫలమయ్యారనడానికి తాజా రసాయన దాడులే నిదర్శనం అని మండిపడ్డారు.
రసాయన దాడులు జరగలేదు
సిరియాపై అమెరికా వైమానిక దాడులను దురాక్రణ చర్యగా రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ అభివర్ణించారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ చేసిన దాడుల నేపథ్యంలో ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి అత్యవసరంగా భేటీ కావాలని డిమాండ్ చేశారు. సిరియాలోని డౌమాలో రసాయన దాడి జరగలేదని, ఆ పేరుతో అమెరికా, దాని మిత్రపక్షాలు దాడులకు తెగబడటం సరికాదన్నారు.
మరింత గట్టిగా పోరాడుతాం
వైమానిక దాడులు దురాక్రమణ చర్య అని పుతిన్ దుయ్యబట్టారు. సిరియాలో నెలకొన్న మానవతా సంక్షోభాన్ని ఇది మరింత పెంచుతుందన్నారు. తమ సైనిక నిపుణుల తనిఖీల్లో రసాయన దాడి ఆనవాళ్లేమీ కనిపించలేదని చెప్పారు. మరోవైపు, తమ సైనిక స్థావారాలే లక్ష్యంగా దాడులు, ప్రత్యర్థులపై మరింత గట్టిగా పోరాడాలన్న విషయాన్ని తెలియజేశాయని సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ అన్నారు. క్షిపణి దాడులు అనాగరికమైన, క్రూరమైన, దురాక్రమణ దాడులన్నారు.
అమెరికా క్షిపణులనే కాదు.. దురహంకారం కూల్చేశాం
అమెరికా దాడులపై సిరియన్లు భగ్గుమన్నారు. అసద్కు మద్దతుగా పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చారు. దాడులు జరిగిన వెంటనే సిరియా, రష్యా, ఇరాన్ జాతీయ పతాకాలను చేత పట్టుకొని ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. అమెరికా క్షిపణులనే కాదు.. దాని దురహంకారాన్ని కూల్చేశామన్నారు. ట్రంప్ క్షిపణులకు భయపడబోమన్నారు. లక్షలాది మంది సిరియన్లు ర్యాలీ తీశారు. వాహనాలకు ఆరన్లు మోగిస్తూ, సిరియా జాతీయ పతకాలతో విజయ సంకేతం చూపుతూ వీధుల్లోకి వచ్చారు.
కంపించిన డమాస్కస్, అమెరికా రాకెట్లు మధ్యలోనే పేల్చేశారు
వైమానిక దాడులతో సిరియా రాజధాని డమాస్కస్ కంపించింది. భారీ విస్ఫోటాలు వచ్చాయి. ఆకాశం మొత్తం పొగ ఆవరించింది. ఒక శాస్త్ర పరిశోధన కేంద్రంపై కూడా దాడి జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ దాడులను ఎదుర్కొనేందుకు తమ గగనతల రక్షణ వ్యవస్థలు స్పందించాయని సిరియా అధికార టీవీ పేర్కొంది. 13 రాకెట్లను మధ్యలోనే పేల్చేసినట్లు తెలిపింది. వందకుపైగా క్రూయిజ్ క్షిపణులను అమెరికా సంకీర్ణ సేనలు ప్రయోగించాయని, వాటిలో చాలా వాటిని గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నట్లు రష్యా రక్షణశాఖ తెలిపింది. సిరియా గగనతల రక్షణ వ్యవస్థ వల్ల తమ బలగాలకు ఎక్కడా నష్టం జరగలేదని అమెరికా రక్షణ మంత్రి జిమ్ మ్యాటిస్ చెప్పారు. మరిన్ని దాడులను కొట్టి పారేయలేమని చెప్పింది.