అసద్ భార్య సంచలన వ్యాఖ్యలు : టీవీ చానెల్ ఇంటర్య్యూలో..
మాస్కో: అంతర్యుద్దాలతో అతలాకుతలం అవుతోన్న సిరియాలో.. ఇప్పటిదాకా దాదాపు 10లక్షల మంది అమాయక ప్రజానీకం బలైపోయినట్లుగా అంతర్జాతీయ మానవహక్కుల సంస్థలు నిర్దారిస్తున్నాయి. గత మూడేళ్లుగా సిరియా జాతీయ సైన్యానికి, తిరుగుబాటు దళాలకు, ఐసిస్ ఉగ్రవాదులకు మధ్య జరుగుతోన్న అంతర్యుద్దంతో సిరియా అట్టుడికిపోతోంది.
ఉగ్రవాదులను, తిరుగుబాటు దళాలను అణిచివేయడానికి ప్రస్తుతం సిరియాలో రష్యా వైమానిక దాడులు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో అంతర్యుద్దాలకు బలైపోతున్న అమాయక ప్రజల సంఖ్య మరింతగా పెరిగిపోతోంది. కాగా, రష్యా అందిస్తోన్న సహకారంతో.. ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతోన్న నేపథ్యంలో.. రష్యన్ టీవీ చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు సిరియా అధ్యక్షుడి సతీమణి ఆస్మా.
ఈ క్రమంలో రొసియా24 చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్బంగా.. పలు సంచలన వ్యాఖ్యలు చేశారు ఆస్మా. తనతో పాటు తన పిల్లలను దేశం దాటిస్తామని అసద్ వ్యతిరేకులు ప్రలోభ పెట్టారని చెప్పారు. 'మిమ్మల్ని, మీ ముగ్గురు పిల్లల్ని సురక్షితంగా సిరియా దాటించేస్తాం. ప్రవాసంలో కూడా మీ జోలికి ఎవరు రాకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం, ఇక్కడి నుంచి వెళ్లండి' అని సిరియా తిరుగుబాటుదారులు చేసిన ప్రతిపాదనను తాను నిర్ద్వంద్వంగా తిరస్కరించానని వెల్లడించారు ఆస్మా.
కాగా, బ్రిటన్ లో స్థిరపడ్డ సిరియన్ దంపతులకు జన్మించిన ఆస్మా.. లండన్ కింగ్స్ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె 2000వ సంవత్సరంలో అసద్ ను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం సిరియాకు తనవంతు మద్దతుగా పలు కీలక నిర్ణయాల్లో తనదైన పాత్ర పోషిస్తున్నారు ఆస్మా.