ఐఎస్ మారణహోమం: 300మందిని నరికేశారు
డెమాస్కస్: ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు మరోసారి మారణహోమం సృష్టించారు. సిరియా భూభాగాలపై పట్టుకోసం, భారీ నర మేధానికి ఒడిగట్టారు. తూర్పుమధ్య నగరం దేరె-ఇల్-జార్లో ఒక్కరోజే 300మందికిపైగా పౌరులను నరికి చంపారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు సహా కనిపించినవారినల్లా అత్యంత దారుణంగా చంపేశారు.
అంతేగాక, బందీల తలలు నరికి నదిలోకి విసిరేశారు. ఉగ్రవాదుల నుంచి పట్టణాన్ని, ప్రజలను కాపాడేందుకు ప్రయత్నించిన సైనికులను కూడా దారుణంగా చంపారు. సుమారు 400మంది పౌరులను బందీలుగా పట్టుకొన్నారు.
‘దేరె-ఇల్-జార్'.. ఉగ్రవాదుల పరంకాకుండా సిరియా సైన్యంతో పాటు మిలీషియా, పౌరులు సాయుధులై ఉగ్రవాదులతో తలపడ్డారు. దీంతో నగరంలోని ప్రతి వీధిలో భీకర పోరు దృశ్యాలు కనిపించాయి.
ఊహించని ప్రతిఘటనతో ఉగ్రవాదులు తొలుత తత్తరపడ్డారు. ఆ వెంటనే ఉన్మాదులుగా మారి నేరుగా పౌరులపైకి రోజంతా విచ్చలవిడిగా కాల్పులు సాగించారు. ఉగ్రవాదులు విజృంభించిన ప్రతి వీధిలో పదుల సంఖ్యలో మృతదేహాలు గుట్టలు పడ్డాయి. ఐఎస్ ఉగ్రవాదులు దేరె-ఇల్-జార్ని చెరబట్టారని ప్రభుత్వ వార్తాసంస్థ ‘సనా' తెలిపింది.
ప్రధానంగా ప్రభుత్వ అనుకూల శ్రేణులు, సైన్యాన్ని తాము చంపినట్టు ఐఎస్ ఉగ్రవాదులు చెబుతుండగా, మృతుల్లో అత్యధికులు పిల్లలు, మహిళలు, వృద్ధులేనని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నరమేధంలో 300 మందికిపైగా మరణించినట్టు నిర్ధారించాయి.
అయితే, 80 మంది జవాన్లు, ప్రభుత్వ అనుకూల మిలీషియాసహా 135 మంది మరణించినట్టు బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న సిరియన్ మానవ హక్కుల పర్యవేక్షణ సంఘం వెల్లడించింది.