సిరియాలో మళ్లీ నరమేధం... 200 మంది హతం
బీరుట్ : సిరియాలో గత కొన్నేళ్లుగా తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న తూర్పు గౌటా ప్రాంతంపై సిరియన్ ఆర్మీ ఆది, సోమవారాల్లో బాంబుల వర్షం కురిపించడంతో ఏకంగా 200 మంది పౌరులు మరణించారు. వీరిలో 57 మందికిపైగా చిన్నారులు ఉన్నారు.
సిరియన్ దళాలు జరిపిన ఈ దాడుల్లో మరో 300 మంది గాయపడ్డారు. ఒక్క సోమవారం నాటి దాడుల్లోనే 127 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులు భారీ సంఖ్యలో ఉండడం.. వారికి చికిత్స చేసేందుకు ఆసుపత్రుల్లో సరిపడా పడకలు కూడా లేకపోవడంతో చికిత్స చేయడం కష్టసాధ్యంగా మారింది.
2015 తర్వాత డమాస్కస్ శివార్లలో జరిగిన అతి పెద్ద దాడులు ఇవేనని మానవ హక్కుల పరిశీలన సంస్థ చీఫ్ రమి అబ్దెల్ రెహమాన్ తెలిపారు. గౌటాలో ప్రస్తుతం పరిస్థితి అదుపు తప్పిందని చెప్పారు. దాదాపు నాలుగు లక్షల జనాభా కలిగిన ఈ ప్రాంతంలో మరోసారి భారీ దాడి జరిగే ప్రమాదముందని అల్-వతన్ పత్రిక తెలిపింది.
2012 నుంచి తూర్పు గౌటా ప్రాంతం రెండు ఉగ్రవాద సంస్థల ఆధీనంలో ఉంది. డమాస్కస్ శివారు ప్రాంతమైన ఈ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్ సైన్యాన్ని పంపించారు. దీంతో పలు పట్టణాలపై సైన్యం విమానాలతో దాడులు చేపట్టింది.
ఈ నెల మొదట్లో కూడా ప్రభుత్వ బలగాలు తిరుగుబాటుదారులపై ఐదు రోజుల పాటు చేపట్టిన దాడుల్లో 250 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై ఐక్యరాజ్య సమితి స్పందిస్తూ పౌరుల హత్యలను తక్షణం ఆపేయాలని సిరియా ప్రభుత్వాన్ని కోరింది.