పొరపాటే: చైనా వైపు దూసుకెళ్లిన తైవాన్ సూపర్సోనిక్ క్షిపణి!
తైపీ: తైవాన్కు చెందిన యుద్ధనౌక నుంచి పొరపాటుగా సూపర్సోనిక్ క్షిపణి ప్రయోగం జరిగింది. ఆ సూపర్సోనిక్ 'ఎయిర్క్రాఫ్ట్ కారియర్ కిల్లర్' క్షిపణి చైనా వైపు వెళ్లింది. అయితే, కావాలని చేయలేదు, తాము ఆ క్షిపణిని పొరపాటుగా ప్రయోగించామని తైవాన్ నేవీ స్పష్టం చేసింది.
కాగా, ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న చైనా, తైవాన్ల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు ఈ ఘటనతో మరింతగా దెబ్బతినే అవకాశం ఏర్పడింది. తైవాన్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 200కి.మీ. రేంజ్ హెసియుంగ్-ఫెంగ్ 3(బ్రేవ్ విండ్) క్షిపణి ప్రయోగం అనుకోకుండా జరిగింది.
ఇది 70కి.మీ.లు ప్రయాణించి పెంగు సమీపంలో నీటిలో పడిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ పొరపాటు ఎలా జరిగిందో కచ్చితమైన వివరాలు తైవాన్ నేవీ వెల్లడించలేదు. కానీ మానవ తప్పిదం వల్లే జరిగి ఉంటుందని సూచనప్రాయంగా తెలిపింది.
ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని వైస్ అడ్మిరల్ మై చియా-షు మీడియాకు వెల్లడించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. సాధారణ పద్ధతిలో ఆపరేషన్స్ జరగలేదని అందుకే ఇలా జరిగి ఉంటుందని అన్నారు.
త్సోయింగ్ నగరంలో నావల్ బేస్లో ఉన్న 500 టన్నుల మిస్సైల్ షిప్పై శుక్రవారం ఉదయం డ్రిల్ సమయంలో పొరపాటుగా క్షిపణి ప్రయోగం జరిగిందని.. చైనా వైపుగా దూసుకెళ్లిందని తెలిపారు. వెంటనే హెలికాప్టర్లు, నేవీ నౌకలు క్షిపణిని వెదుకుతూ వెళ్లినట్లు చియా-షు తెలిపారు.
కాగా, ఈ క్షిపణి ఓ పడవపైకి దూసుకెళ్లడంతో ఓ కెప్టెన్ తోపాటు ముగ్గురు సిబ్బంది మరణించారు. మరికొంతమంది విదేశీయులు క్షేమంగా బయటపడ్డారు. మరణించిన వారి పట్ల సానుభూతి వ్యక్తం చేసిన తైవాన్ ప్రభుత్వం.. ఘటనపై బాధిత కుటుంబసభ్యులను క్షమాపణలు కోరింది. 1950లో ముగిసిన యుద్ధం తర్వాత నుంచి చైనా, తైవాన్ దేశాల మధ్య మంచి సంబంధాలు లేవు.