చైనా పరువు తీసిన తైవాన్: మామూలు షాక్ ఇవ్వలేదుగా: డ్రాగన్ సార్వభౌమత్వానికి సవాల్
తైపీ: సరిహద్దు వివాదాలను అడ్డుగా పెట్టుకుని భారత్పై కయ్యానికి కాలు దువ్వుతోన్న డ్రాగన్ కంట్రీ చైనాకు అనూహ్యంగా షాక్ ఇచ్చింది తైవాన్. అలాంటిలాంటి షాక్ కాదు అది. చైనా దూకుడుకు ఎదురొడ్డి నిలిచింది. ఢీ అంటే ఢీ అనడానికి సిద్ధపడింది. అంతర్జాతీయ దేశాల్లో చైనా పరువు తీసినట్టయింది. ఇప్పటికే భారత భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించి.. అంతర్జాతీయంగా అభాసుపాలైన చైనాకు.. తాజాగా తైవాన్ తీసుకున్న నిర్ణయం.. మరింత అవమానాలకు గురి చేసేదిగా భావిస్తున్నారు.
పాస్పోర్టును రీడిజైన్ చేసిన తైవాన్..
తైవాన్ తన దేశ పాస్పోర్టును రీడిజైన్ చేసింది. రిపబ్లిక్ ఆఫ్ చైనా అనే ఇంగ్లీష్ అక్షరాలను నిర్ద్వందంగా తొలగించింది. వాటి స్థానంలో తైవాన్ అనే ఆంగ్ల ఆక్షరాలను పెద్ద సైజులో ముద్రించింది. రిపబ్లిక్ ఆఫ్ చైనా అనే ఆంగ్ల అక్షరాలను తుడిచేసినప్పటికీ..తైవాన్ భాషలో చైనా అనే అక్షరాలను ముద్రించింది. రీడిజైన్ చేసిన పాస్పోర్టును ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి జోసెఫ్ వు కొద్దిసేపటి కిందటే ఆవిష్కరించారు. పాస్పోర్టుపై తమ దేశ పేరును మరింత ఆకర్షణీయంగా ముద్రించుకోవడం ఆనందాన్ని ఇస్తోందని, ఇకపై ప్రపంచ దేశాల్లో చైనీయులమనే ముద్ర పోగొట్టినట్టవుతుందని వ్యాఖ్యానించారు.
చైనా జాతీయులుగా..
తమ దేశ పాస్పోర్టును తైవాన్ రీడిజైన్ చేయడానికి, రిపబ్లిక్ ఆఫ్ చైనా పేరును తొలగించడానికీ కారణాలు లేకపోలేదు. పాత పాస్పోర్టు వల్ల తైవాన్ ప్రజలను విదేశీయులు చైనీయులుగా పొరపడుతున్నారని, ఈ గందరగోళాన్ని తెర దించడానికే తాము పాస్పోర్టును రీడిజైన్ చేసినట్లు జోసెఫ్ వూ తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తైవానీయులు.. తమ దేశ పాస్పోర్టుపై పొరుగు దేశాలకు వెళ్లినప్పుడు.. వారిని అందరూ చైనీయులుగా భావిస్తున్నారని అన్నారు. కొన్ని దేశాలు చైనీయులపై ఆంక్షలను విధించాయని, రిపబ్లిక్ ఆఫ్ చైనా అనే అక్షరాలు ఉండటం వల్ల తమ దేశ ప్రజలపైనా వాటిని వర్తింపజేస్తున్నారని చెప్పారు.
ఎయిర్పోర్టుల్లో విస్తృత తనిఖీలు..
కరోనా వైరస్ పుట్టుకకు చైనా కారణమని విదేశీయులు భావిస్తోన్నారని, తమను కూడా చైనీయుల్లా ట్రీట్ చేస్తున్నారని చెప్పారు. విమానాశ్రయాల్లో విస్తృత తనిఖీల సందర్భంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఫిర్యాదులు అందుతున్నాయని జోసెఫ్ వూ తెలిపారు. అందుకే- రిపబ్లిక్ ఆఫ్ చైనా అనే ఇంగ్లీష్ అక్షరాలను తొలగించామని వివరణ ఇచ్చారు. తాము చైనీయులం కాదని, తైవానీయులమని వివరణ ఇచ్చుకోవాల్సిన దుస్థితి ఎదురవుతోందని అన్నారు. ఈ పరిస్థితులను అధిగమించడానికి పాస్పోర్టును రీడిజైన్ చేయాలని నిర్ణయించుకున్నామని, దాన్ని అమలు చేశామని చెప్పారు.
గందరగోళానికి తెర..
తైవాన్లో కరోనా కేసులు నియంత్రణలో ఉన్నాయి. నామమాత్రంగా నమోదు అయ్యాయి. ఇప్పటిదాకా తైవాన్లో నమోదైన కరోనా వైరస్ కేసులు 489 మాత్రమే. ఇందులో 471 మంది రికవరీ అయ్యారు. ఏడుమంది మరణించారు. కరోనా వైరస్ను వ్యాప్తి చెందడాన్ని అదుపు చేయడంలో తాము ఘన విజయాన్ని సాధించామని, అయినప్పటికీ.. తమ దేశ పాస్పోర్ట్పై చైనా పేరు ఉండటం వల్ల అందరూ చైనీయులుగానే భావిస్తున్నారని అన్నారు. ఇకపై ఈ గందరగోళం తలెత్తబోదని ఆశిస్తున్నట్లు జోసెఫ్ వూ తెలిపారు. భారత్తో సరిహద్దు వివాదాలను కొని తెచ్చుకుంటోన్న చైనాకు తైవాన్ కాస్త గట్టిగానే షాక్ ఇచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.