ఏకధాటిగా వీడియో గేమ్ ఆడి ప్రాణాలు పొగొట్టుకున్నాడు
తైవాన్: మూడు రోజులపాటు ఏకధాటిగా వీడియో గేమ్ ఆడిన ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాద ఘటన తైవాన్లో చోటు చేసుకుంది. తైవాన్లోని తైపీకి చెందిన సెయ్(32) అనే వ్యక్తి స్థానిక ఇంటర్నెట్ కేఫ్లో మూడు రోజులపాటు ఏకధాటిగా వీడియో గేమ్ ఆడుతూ మృతి చెందాడు.
మొదట గమనించిన ఆ కేఫ్ సిబ్బంది అతడు నిద్రపోతున్నాడని భావించారు. కొంతసేపటి తర్వాత అనుమానం వచ్చి అతడ్ని పరికించి చూశారు. అతనికి శ్వాస ఆడకపోవడంతో వెంటనే అతడ్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు.అతనికి అనారోగ్య లక్షణాలు ఏవీ లేవని.. అయితే నిరంతరాయంగా వీడియో గేమ్ ఆడటం వల్ల గుండె ఆగిపోయి ఉంటుందని చెప్పారు.
కాగా, సెయ్ తరచూ తమ కేఫ్కి వస్తూ ఉంటాడని ఆ కేఫ్ యజమాని తెలిపారు. వచ్చిన ప్రతీసారీ ఇదే విధంగా ఎక్కువ గంటలు వీడియో గేమ్ ఆడుతూ ఉండేవాడని చెప్పారు. సెయ్ మృటి చెందిన విషయాన్ని అతని కుటుంబసభ్యులకు ఆ కేఫ్ సిబ్బంది చేరవేశారు. కాగా, తైవాన్లో వీడియో ఆడుతూ ఓ వ్యక్తి మృతి చెందడం ఇది రెండోసారి.
పెషావర్ దాడి: ఐదుగురి అరెస్ట్
ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని పెషావర్ సైనిక పాఠశాలపై జరిగిన దాడితో సంబంధమున్న ఐదుగురు అనుమానితులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ల తూర్పు సరిహద్దు ప్రాంతంలో ఇటీవల వారిని అరెస్ట్ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పెషావర్ సైనిక పాఠశాలపై ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 148మంది విద్యార్థులతోపాటు సిబ్బంది మృతి చెందిన విషయం తెలిసిందే.