గడ్డం తీయడంపై నిషేధం... సెలూన్ నిర్వాహకులకు తాలిబన్ల ఆదేశాలు... ఉల్లంఘిస్తే కఠిన చర్యలే...
ఆఫ్గనిస్తాన్లో తాలిబన్లు ఒక్కొక్కటిగా ఇస్లామిక్ చట్టాలను కఠినంగా అమలుచేస్తున్నారు. తాజాగా హెల్మండ్ ప్రావిన్స్లోని క్షౌరశాలలకు 'గడ్డం' గీయవద్దంటూ హుకుం జారీ చేశారు. గడ్డం తొలగించడం లేదా కత్తిరించడం ఇస్లామిక్ చట్టానికి విరుద్దమని పేర్కొన్నారు.ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు.అంతేకాదు, హెయిర్ కట్స్ విషయంలోనూ షరియా చట్టాలను పాటించాల్సిందేనని హెచ్చరించారు.
Recommended Video
ఇవే ఆదేశాలు తమకూ అందినట్లు కాబూల్లోని కొందరు సెలూన్ నిర్వాహకులు తెలిపారు. తాలిబన్ ఫైటర్లు తరుచూ తమ సెలూన్ వద్దకు వచ్చి గడ్డాలు గీయవద్దని ఆదేశిస్తున్నట్లు కాబూల్కి చెందిన ఓ బార్బర్ తెలిపారు. దీనిపై తనిఖీలకు ఇన్స్పెక్టర్లను కూడా పంపిస్తామని చెప్పారన్నారు. మరో బార్బర్ మాట్లాడుతూ.. తాలిబన్ ప్రభుత్వ అధికారి పేరుతో తనకు ఓ ఫోన్ కాల్ వచ్చిందన్నారు.ఇకపై అమెరికన్ హెయిర్ స్టైల్స్ చేయవద్దని తనను హెచ్చరించినట్లు చెప్పారు.
తాలిబన్ల పాలనలో వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు కూడా తావు లేకుండా పోతోంది.అంతా వారు చెప్పినట్లు నడుచుకోవాల్సిందే. 1996-2001 వరకు సాగిన తాలిబన్ల పాలనలో స్టైలిష్ హెయిర్ కట్స్పై నిషేధం విధించారు.పురుషులు గడ్డం తీసుకోవద్దని ఆంక్షలు విధించారు. అయితే తాలిబన్ల పాలన అంతమయ్యాక... చాలామంది ఆఫ్గన్లు క్లీన్ షేవ్కి,స్టైలిష్ హెయిర్ స్టైల్స్కి అలవాటుపడ్డారు. ఇప్పుడు తాలిబన్లు విధించిన తాజా ఆంక్షలతో వారికి భయం పట్టుకుంది. తాలిబన్ల చేతిలో చావడం కన్నా గడ్డం తీయకపోవడమే బెటర్ అని వారు భావిస్తున్నారు.
ఆఫ్గనిస్తాన్ను హస్తగతం చేసుకున్నాక తాలిబన్లు ఒక్కొక్కటిగా ఇస్లామిక్ షరియా చట్టాలను అమలుచేస్తున్నారు.ఇటీవలే కాబూల్లోని మహిళా వర్కర్స్ అందరినీ ఇంటికి పరిమితం చేసేలా ఆదేశాలిచ్చారు.కేవలం పురుషులతో భర్తీ చేయలేని పోస్టులకు మాత్రమే స్త్రీలకు అనుమతినిచ్చారు.ఒక్క కాబూల్లోనే కాదు... తాలిబన్లు అధికారం చేపట్టాక దేశవ్యాప్తంగా ప్రభుత్వ,ప్రైవేట్ కార్యాలయాల్లో పనిచేస్తున్న మహిళలను బలవంతంగా ఉద్యోగాలు మానిపించి ఇళ్లకు పంపించారు.మళ్లీ కార్యాలయాలకు వస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.
33 మంది మంత్రులతో తాలిబన్లు ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వంలో మహిళలకు చోటు దక్కలేదు.అన్ని వర్గాలు,గ్రూపులను కలుపుకుపోతామని చెప్పిన తాలిబన్లు ఆ మాట నిలబెట్టుకోలేదు.కేవలం తాలిబన్లు,హక్కనీ నెట్వర్క్ తీవ్రవాదులకు మాత్రమే ప్రభుత్వంలో చోటు దక్కింది. దీనిపై పదుల సంఖ్యలో మహిళలు కాబూల్ వీధుల్లోకి వచ్చి నిరసన తెలపగా... వారికి కౌంటర్గా కాబూల్ వర్సిటీలో మహిళలతో తాలిబన్లు సమావేశం ఏర్పాటు చేయించారు. నిరసన తెలియజేసిన మహిళలకు వ్యతిరేకంగా వారితో స్టేట్మెంట్స్ ఇప్పించారు.అయితే తమను చంపేస్తామని బెదిరించడం... యూనివర్సిటీలో చదవకుండా చేస్తామని బెదిరింపులకు గురిచేయడం వల్లే కాబూల్ వర్సిటీలో సమావేశానికి హాజరైనట్లు పలువురు విద్యార్థినులు వెల్లడించడం గమనార్హం. ఇటీవల బాలుర స్కూళ్ల రీఓపెనింగ్కి అనుమతినిచ్చిన తాలిబన్లు... ఆడపిల్లలు చదువుకునే స్కూళ్లు తెరిచేందుకు అనుమతినివ్వలేదు.దీంతో గతంలో లాగే ఆడపిల్లలకు విద్యను నిషేధించే యోచనలో తాలిబన్లు ఉన్నట్లు తెలుస్తోంది.