ఆఫ్ఘన్ టైగర్ వసిల్ అహ్మద్ దారుణ హత్య
కాబూల్: పదేళ్ల వయస్సులో మిలటరీ దళానికి నాయకత్వం వహించి, తుపాకి చేతపట్టి తాలిబన్లకు చుక్కలు చూపించి, ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం నుంచి శభాష్ అనింపించుకుని సన్మానాలు చేయించుకున్న పిల్లాడు వసిల్ అహ్మద్ (10) దారుణ హత్యకు గురైనాడు.
అతని కుటుంబ సభ్యులు మిలటరీలో ఉన్న వసిల్ అహ్మద్ ను బయటకు తీసుకు వచ్చి పాఠశాలలో నాలుగో తరగతిలో చేర్పించి ఉన్నత విద్య చెప్పించాలని ప్రయత్నించారు. అయితే వసిల్ అహ్మద్ మీద తాలిబన్లు పగ పెంచుకున్నారు.
కూరగాయలు కొనడానికి ఇంటి నుంచి బయటకు వచ్చిన వసిల్ అహ్మద్ ను దారుణంగా హత్య చేశారు. బైక్ లో వచ్చిన ఇద్దరు తాలిబన్లు తుపాకితో వసిల్ అహమ్మద్ తలలో కాల్చి హత్య చేసి అక్కడి నుంచి పారిపోయారని ప్రత్యక్ష సాక్షలు చెప్పారు.
వసిల్ మామ ముల్లా అబ్దుల్ సమద్ తాలిబన్ ఉగ్రవాద దళాలకు కమాండర్ గా పని చేసేవాడు. ముల్లా సమద్ తో పాటు వసిల్ తండ్రి ఉగ్రవాదులలో ఉన్నాడు. తరువాత ముల్లా సమద్ తుపాకులు వదిలి పెట్టి వసిల్ తండ్రితో పాటు 36 మందితో కలిసి జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించాడు.
ఓరుజ్గన్ జిల్లాలో ఆఫ్ఘన్ ప్రభుత్వం స్థానిక పోలీసు సేనల భాద్యతను ముల్లా సమద్ కు అప్పగించింది. అప్పటి నుంచి ప్రభుత్వం తరపున ముల్లా సమద్ తాలిబన్లతో పోరాటం చేశాడు. అయితే తాలిబన్లు జరిపిన దాడిలో వసిల్ తండ్రితో పాటు 18 మంది మరణించారు.
ముల్లా సమద్ కు తీవ్రగాయాలైనాయి. ఆ సందర్బంలో వసిల్ పోలీసు సేనలకు కమాండర్ గా బాధ్యతలు తీసుకున్నాడు. తాలిబన్లతో పోరాటం చేశాడు. తుపాకితో తాలిబన్లను అంతం చేశాడు. ఓరుజ్గన్ పరిసర ప్రాంతాల్లో తాలిబన్లు లేకుండా చేశాడు.
అంత చిన్ని వయస్సులో ఉగ్రవాదులతో పోరాటం చేసిన వసిల్ ను పోలీసు అధికారులు, ప్రభుత్వం అభినందించింది. పోలీసు దుస్తులు వేసి అతనిని ఘనంగా సన్నానించారు. వసిల్ కు ఉన్నత విద్య చెప్పించాలని అతని కుటుంబ సభ్యులు భావించారు.
అయితే వారి ఆశలు ఎంతో కాలం నిలవలేదని అతని మామ ముల్లా సమద్ అంటున్నారు. వసిల్ హత్యను ఆఫ్ఘన్ ప్రభుత్వం, మానవ హక్కుల సంఘాలు, స్థానికులు ఖండించారు. వసిల్ చిన్నపిల్లాడు అని చూడకుండా తాలిబన్లు దారుణంగా హత్య చేశారని మండిపడుతున్నారు.